సీఎం జ‌గ‌న్‌కు ఊహించ‌ని ట్విస్టిచ్చిన నిరుద్యోగి..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ నిరుద్యోగి ఏపీ సీఎంకు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దీంతో ఇప్పుడు సీఎం జ‌గ‌న్ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అనే చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ మౌనంగా ఉంటే.. అది త‌న మెడ‌కే చుట్టుకుని..త‌న విశ్వ‌స‌నీయ‌త‌కే పెద్ద గొడ్డ‌లిపెట్టుగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇంత‌కీ ఆ నిరుద్యోగి ఇచ్చిన ట్విస్ట్ ఏంటో చూద్దామా..?

ఏపీలో అదికారం చేప‌ట్టిన జ‌గ‌న్‌.. వెంట‌నే ఒక ప్ర‌తిష్టాత్మక కార్య‌క్ర‌మం అంటూ.. ‘స్పంద‌న’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌భుత్వంలోని లోపాలు.. అధికారులు చేసే త‌ప్పుల‌ను ప్ర‌శ్నించేందుకు ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఈ స్పంద‌న‌లో వ‌చ్చే ఫిర్యాదుల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలించి సాధ్య‌మైనంత వేగంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌త్యేక విభాగం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తి వారం స్పంద‌న‌పై స‌మీక్ష‌లు చేస్తున్నారు. దీంతో ఫిర్యాదుల‌పై త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నారు. అధికారులు ప‌ట్టించుకోని వాటిపై సీఎం స్వ‌యంగా ప‌ట్టించుకుని ఆదేశాలు ఇస్తున్న విష‌యంకూడా తెలిసిందే.

అయితే.. ఇప్పుడు ఇదే స్పంద‌న వేదిక‌గా.. ఓ నిరుద్యోగి..ఫిర్యాదు చేశాడు. అది కూడా ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైనే ఆ నిరుద్యోగి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. 2019లో 6,500 పోలీసు పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ సీఎం జ‌గ‌న్‌ ప్రకటించారని, హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌.. కూడా 2020లో 6,300 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని, తీరా జాబ్‌ క్యాలెండర్‌లో 450 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన ఆ నిరుద్యోగి స్పంద‌న కాల్‌సెంటర్‌కు ఫోన్‌లో తెలిపాడు. లక్షలాదిమంది నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం, హోంమంత్రిపై కేసు నమోదు చేయాలని, వారిని కర్నూలు కలెక్టరేట్‌కు పిలిపించాలని ఫిర్యాదులో కోరాడు.

అయితే, సీఎం, హోంమంత్రిపై కేసు నమోదు చేసే అవకాశం లేదని కాల్‌సెంటర్‌ నిర్వాహకులు సమాధానమిచ్చారు. అన్యాయం జరిగితే ఎలాంటి వారిపైనైనా స్పందనలో ఫిర్యాదు చేయవచ్చని సీఎం జగన్‌ స్వయంగా చెప్పారని, అలాంటిది ఆయనపైనే కేసు ఎందుకు నమోదు చేయరని ఆ నిరుద్యోగి నిలదీశాడు. ఫిర్యాదు తీసుకోకపోతే రాష్ట్రపతికి తెలియజేస్తానని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ ఆడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. వాస్త‌వానికి స్పంద‌న‌లో ఎలాంటి వారిపైనైనా ఫిర్యాదు చేయొచ్చ‌ని.. సీఎం స్వ‌యంగా చెప్పాక‌.. ఇప్పుడు ఏం చేస్తారో.. అనేది ఆస‌క్తిగా మారింది. మొత్తానికి ఇది భారీ ట్విస్టే.. అంటున్నారు ప‌రిశీల‌కులు.