సౌత్ రూట్లో చిరాగ్ – సంచలన నిర్ణయం

బీహార్ ప్రజల మద్దతు కోరుతూ ఎల్జేపీ కీలక నేత చిరాగా పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర మాజీమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత పార్టీ నిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షడు, ఎంపి అయిన చిరాగ్ ను స్వయంగా బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పదవిలో నుండి దింపేసిన విషయం తెలిసిందే. పదవిలో నుండి దింపటంతో సరిపెట్టుకోకుండా ఏకంగా పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు.

పార్టీలో హఠాత్తుగా సంభవించిన పరిణామాలతో చిరాగ్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో పార్టీ మీద ఆధిపత్యం తమదంటే తమదంటు రెండు వర్గాలు రోడ్డెక్కాయి. చివరకు ఈ వివాదం ఒకవైపు కేంద్ర ఎన్నికల కమీషన్ ముందుకు చేరింది. ఇదే సమయంలో లోక్ సభ స్పీకర్ కు కూడా రెండువర్గాలు ఒకదానిపై ఇంకోటి ఫిర్యాదులు చేసుకున్నాయి. మరి ఈ వివాదాన్ని ఎన్నికల కమీషన్ , లోక్ సభ స్పీకర్ ఏ విధంగా పరిష్కారనే విషయం ఆసక్తిగా మారింది.

ఈ వివాదాలు ఇలావుండగానే ప్రజల మద్దతు కోరుతు చిరాగ్ పాదయాత్రను ప్రకటించేశారు. తన తండ్రి రామ్ విలాస్ జయంతి అయిన జూలై 5వ తేదీన హాజీపూర్ నుండి పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంటే పార్టీ కోసం బాబాయ్ వర్గంతో గొడవపడి ఉపయోగం లేదని అర్ధమైనట్లుంది. అందుకనే నేరుగా ప్రజల మద్దతుతోనే పార్టీని తిరిగి సొంతం చేసుకునేందుకు చిరాగ్ ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది.

చిరాగ్ కు ఇలాంటి పరిస్ధితి రావటానికి స్వయంకృతమే అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. రామ్ విలాస్ ఉన్నపుడు పార్టీలోని కీలక నేతలతో మంతనాలు జరిపి నిర్ణయం తీసుకునేవారు. కానీ చిరాగ్ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీయేలో ఉంటూనే మరో భాగస్వామ్య పార్టీ జేడీఎస్ కు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపారు. పోటీవద్దని నేతలు ఎంతచెప్పినా చిరాగ్ వినలేదు. ఇలాంటి అనేక ఒంటెత్తుపోకడల కారణంగానే పార్టీ చీలిపోయింది. మరి జనాలు ఎవరికి మద్దతిస్తారో చూడాల్సిందే.