బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే సరిపోదు!

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ రేసులో దూసుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె కెరీర్ చాలా హిట్లు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి తెలుగు సినిమా అవకాశాలు రావడం లేదు. చివరిగా ఆమె నితిన్ నటించిన ‘చెక్’ సినిమాలో కనిపించింది. రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసింది. ఇది తప్ప ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. దానికి కారణం ఏంటనే విషయం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రకుల్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయని స్పష్టం చేసింది.

అలానే ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే నెట్టుకొస్తారనే విషయాన్ని నమ్మనని చెబుతోంది రకుల్. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఈ కాన్సెప్ట్ వినిపిస్తూనే ఉంటుందని.. అయితే టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలరని చెప్పింది. బ్యాక్ గ్రౌండ్ ఉంటే కొన్ని అవకాశాలు వస్తాయి కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఎక్కువకాలం రాణించగలడం మాత్రం టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ ప్రతిభావంతులను ప్రేక్షకులే నిర్ణయిస్తారని.. అలాంటి వారికే పట్టం కడతారని తెలిపింది.

ఇక సినిమాలకు సంబంధించిన భాషాపరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని.. నచ్చిన కథ దొరికితే ఒప్పుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో ‘ఎటాక్’, ‘మే డే’, ‘థాంక్ గాడ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో ‘అయలన్’, ‘ఇండియన్ 2’ వంటి సినిమాల్లో నటించడానికి అంగీకరించింది. సౌత్ లో ఆమెకి అవకాశాలు తగ్గినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.