బీజేపీ విష‌యంలో ఎవ‌రు బెస్ట్‌.. బాబా ? జ‌గ‌నా ?

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ నేత‌లు ఒక సందిగ్ధ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకుంటామా? లేదా? ఓటు బ్యాంకు పెరుగుతుందా? పెర‌గ‌దా? దీనికి సంబంధించి ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? అనే ప్ర‌శ్న‌ల మ‌ధ్య నేత‌లు ప‌రుగులు పెడుతున్నారు. ఇదే స‌మ‌యంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో.. కంపేర్ చేస్తూ.. బీజేపీకి ఉన్న ఎడ్జ్ పై మ‌రికొంద‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ రెండు ప్ర‌భుత్వాల్లో పాల‌కులు బీజేపీ విష‌యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగారు..? అనేది కూడా లెక్క‌ల్లోకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు పాల‌న విష‌యానికి వ‌స్తే.. మూడేళ్ల‌పాటు బీజేపీ-టీడీపీలు క‌లిసే ప్ర‌భుత్వాన్ని న‌డిపాయి. మంత్రి ప‌ద‌వులు పంచుకు న్నారు. అయితే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఏడాదిన్న‌ర రెండేళ్ల స‌మ‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే.. క‌లిసి న‌డిచిన మూడేళ్ల కాలంలో టీడీపీ ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూపే సాహ‌సం బీజేపీ చేయ‌లేక పోయింది. దీంతో పార్టీ పుంజుకోలేక‌పోయింది. కేవ‌లం న‌లుగురు ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుని ముందుకు సాగింది. స్థానికంగా బలహీన నాయకత్వం వల్ల ఆ స‌మ‌యంలో టీడీపీకి పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోయింది.

దీంతో బీజేపీ పుంజుకోలేక పోయింది. పైగా.. అప్ప‌టి ప్ర‌భుత్వంలో భాగంగా ఉండీ కొన్నాళ్ల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. బీజేపీ నాయ‌కులు చాలా మంది చంద్ర‌బాబుకు అత్యంత విశ్వ‌స‌నీయులుగా వ్య‌వ‌హ‌రించార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీంతో బీజేపీ నేత‌లు.. ఎక్క‌డా నోరు విప్పి.. చంద్ర‌బాబును కానీ,ప్ర‌భుత్వాన్ని కానీ విమ‌ర్శించ‌లేక పోయారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామి కాదు. దీంతో స‌ర్కారును ఎండ‌గ‌ట్టేందుకు, తాము పుంజుకునేందుకు మంచి ఎడ్జ్ ఉంద‌ని.. ఉంటుంద‌ని.. అంటారు బీజేపీ నేత‌లు. రాష్ట్ర స్థాయి నేత‌లు కూడా ఇదే విష‌యం చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చే స‌రికి మాత్రం జ‌గ‌న్‌ను తూతూ మంత్రంగా విమ‌ర్శించి ప‌క్క‌కు త‌ప్పుకొంటున్నారు.

ఇక‌, కేంద్రం ఇస్తున్న నిధుల‌తో అమ‌లు చేస్తున్న రైతు భ‌రోసా వంటి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వం పీఎం కిసాన్ అనే పేరును జోడించింది. దీంతో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు బీజేపీ నేత‌ల‌కు వాయిస్ లేకుండా పోయింది. ఇక‌, గ‌తంలో జ‌రిగిన‌ట్టే.. కొంద‌రు బీజేపీ నేత‌లు.. జ‌గ‌న్ స‌ర్కారుతో మిలాఖ‌త్ అయ్యార‌ని ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏదో ఒక రూపంలో త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుండ‌డంతో నోరు విప్పితే.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారే త‌ప్ప‌.. పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో నేత‌లు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని.. సొంత నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. సో.. అప్ప‌ట్లోను, ఇప్ప‌ట్లోనూ.. బీజేపీని ప‌ట్టుకుని న‌డిచేవారే త‌ప్ప‌.. దానిని న‌డిపించేవారు లేర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.