తల్లా..? పెళ్లామా..? కోర్టు ముంగిట మైనర్ బాలుడు..!

మైనర్ బాలుడి సంరక్షణ.. తల్లికి ఇవ్వాలా..? లేక భార్యకు ఇవ్వాలా అనే సందిగ్ధత ఏర్పడింది. నా కొడుకు సంరక్షణ నాకే కావాలంటూ తల్లి.. నా భర్త నాతోనే ఉండాలని భార్య.. కోర్టు మెట్లు ఎక్కగా.. వారి సమస్య తీర్చడం కోర్టు వంతు అయ్యింది. ఈ వింత కేసు అలహాబాద్ హైకోర్టులో ఎదురు కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ హైకోర్టు ముందుకు ఓ వింత కేసు వచ్చింది. పదహారేళ్ల మైనర్ బాలుడిని తమ సంరక్షణలో ఉండేలా అనుమతించాలంటూ ఓ వైపు తల్లి, మరో వైపు భార్య కోర్టులో కేసు వేశారు. మైనర్ వివాహం చెల్లుబాటు కాదు కాబట్టి… తల్లి వెంట వెళ్లమంటే బాలుడు ససేమిరా అంటూ పెళ్లామే కావాలని వాదించాడు.

అతని కోరిక మన్నించి పంపిద్ధామంటే… మైనర్ బాలుడితో.. మేజర్ యువతి సహజీవనం చేస్తే పోక్సో చట్టం కింద నేరం కిందకు వస్తుంది. కాబట్టి.. బాలుడికి మైనార్టీ తీరేవరకు అంటే.. 2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

మైనార్టీ తీరాక అతను తన ఇష్టప్రకారం ఎవరితోనైనా ఉండవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఆజంగఢ్ కు చెందిన బాలుడి తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ జేజే మునీర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆ మైనర్ బాలుడు.. మేజర్ యువతి కి పెళ్లై చాలా కాలామే అవుతుందట. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. వీరికి బాబు పుట్టిన తర్వాత.. తన కొడుకు మైనర్ అని చెప్పి.. అతని తల్లి కోర్టును ఆశ్రయించడం గమనార్హం.