వ్యాక్సిన్ తో భారత్ లో తొలి మరణం నమోదు..!

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీంతో.. దేశ ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎపెక్ట్స్ సాధారణంగా కనపడుతునే ఉన్నాయి.

అయితే.. వ్యాక్సిన్ వచ్చిన తొలి రోజుల్లో.. దీని కారణంగా చనిపోతున్నారంటూ చాలానే వార్తలువచ్చాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న అనంతరం అనారోగ్యానికి గురై మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే వారి మరణాలు పూర్తిగా వ్యాక్సిన్‌ వల్లే కావని వైద్యులు కొట్టిపారేశారు.

ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లనే చనిపోయినట్లు ఎక్కడా ధృవీకరించలేదు. కానీ మొదటిసారి వ్యాక్సిన్‌ వల్ల ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది. టీకా వేసుకున్న తరువాత వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలను అధ్యయనం చేస్తున్న అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌(ఏఈఎఫ్‌ఐ) టీకా మరణాన్ని ధ్రుృవీకరించింది. మార్చి 8న కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి అనాఫిలాక్సిస్(తీవ్ర ఎలర్జీ) కారణంగా మరణించినట్లు మంగళవారం వెల్లడించింది. భారత్ లో వ్యాక్సిన్ కారణంగా చనిపోయిన ఏకైక వ్యక్తి ఇతనే కావడం గమనార్హం.