బీజేపీకే అంటుకున్న మంటలు

పచ్చని, ప్రశాంత దీవులలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిచ్చుపెట్టింది. కేరళకు ఆనుకునుండే లక్షద్వీప్ లో నిబంధనల పేరుతో బీజేపీ మంటలు పెట్టాలని చూసింది. కానీ చివరకు ఆ మంటలు పార్టీకే అంటుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే లక్షద్వీప్ లో జనాభా సుమారు 85 వేలు. ఇందులో 95 శాతం ముస్లిం మైనారిటీలే ఉంటారు.

ఇలాంటి ద్వీపంలో స్ధానికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలను అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కుమార్ తెచ్చారు. దాంతో ఇపుడు ద్వీప్ లో ఆందోళనమొదలయ్యాయి. ఇంతకీ కొత్త నిబంధనలు ఏమిటంటే ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువుంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీకి అనర్హులట. ఇప్పటివరకు మొత్తం 10 దీవుల్లో ఒక్కచోట మాత్రమే మద్యం దొరుకుతుంది. అలాంటిది ఇపుడు అన్నీ దీవుల్లోను మద్యానికి అనుమతులు ఇచ్చేశారు.

అలాగే గో మాంసాన్ని తినటం నిషేధించారు. చివరగా గూండా చట్టాన్ని పట్టుకొచ్చారు. ఈ చట్టం కింద ఎవరైనా అరెస్టు చేస్తే ఏడాదివరకు కోర్టులో కూడా ప్రవేశపెట్టక్కర్లేదు. ఇలాంటి చట్టాలను పట్టుకొచ్చిన అడ్మినిస్ట్రేటర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో కేంద్రం కాస్త వెనక్కుతగ్గింది. ఇదే సమయంలో లక్షద్వీప్ లో బాగా పాపులరైన నటి, దర్శకురాలు, నిర్మాత, మోడలైన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు.

ఇంతకీ ఆమెమీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే అడ్మినిస్ట్రేటర్ ను సుల్తానా జీవాయుధంగా వర్ణించారు. దాంతో ఆమెపై కేసు పెట్టారు. అసలే ముస్లిం మైనారిటిలుండే ద్వీపం. పైగా కేసు పెట్టింది కూడా చాలా పాపులరైన ముస్లిం సెలబ్రిటీపైనే ఇంకేముంది లక్షద్వీప్ లో మంటలు ఒక్కసారిగా రాజుకుంది. ఎప్పుడైతే ఆయేషా మీద రాజద్రోహం కేసు పెట్టారో వెంటనే ముస్లింలు మండిపోయారు.

రాజద్రోహం కేసు మంటలు బీజేపీలోని కీలక నేతలకు బాగా తగిలింది. వెంటనే 15 మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. ఇదే విషయమై మొన్నటి మేనెలలలోనే 10 మంది సీనియర్లు రాజీనామా చేశారు. ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్ లో చిచ్చుపెట్టి లబ్దిపొందుదామని ప్రయత్నించిన కేంద్రానికి ఇపుడు అదే రివర్సులో తగులుకుంది. మరి తాజా కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.