పాపం వ‌ర్మ క‌ష్ట‌ప‌డుతున్నాడు కానీ..

సంచ‌ల‌న వాస్త‌వ ఘట‌న‌ల ఆధారంగా సినిమాలు తీయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఐతే ఆయ‌న శ్ర‌ద్ధ పెట్టి సినిమాలు తీసిన‌పుడు ప్రేక్ష‌కులు వాటికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కానీ కొన్నేళ్ల నుంచి ఆయ‌న ఎంత నాసిర‌కం సినిమాలు తీస్తున్నాడో.. ఎలా త‌న అభిమానుల‌ను హింసిస్తున్నాడో తెలిసిందే. డైహార్డ్ ఫ్యాన్స్ సైతం వ‌ర్మ సినిమా అంటే బెంబేలెత్తిపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. తాను ఫామ్ కోల్పోయాక కూడా కొంత‌కాలం ప‌బ్లిసిటీ గిమ్మిక్కుల‌తో నెట్టుకొచ్చాడు కానీ.. ఈ మ‌ధ్య అవి కూడా ప‌ని చేయ‌ట్లేదు.

మ‌ర్డ‌ర్, క‌రోనా వైర‌స్ లాంటి వ‌ర్మ బ్రాండు సినిమాల‌కు క‌నీస స్పంద‌న క‌ర‌వైంది. వీటి మీద పెట్టిన స్వ‌ల్ప పెట్టుబ‌డి కూడా వెన‌క్కి రాలేదు. అయినా వ‌ర్మ ఆగ‌ట్లేదు. దిశ ఎన్‌కౌంట‌ర్ అంటూ మ‌రో సంచ‌ల‌న ఉదంతంపై సినిమాను రెడీ చేశాడు.

ఐతే గ‌త ఏడాదే రిలీజ్ చేద్దామ‌నుకున్న ఈ చిత్రానికి కోర్టులో అడ్డంకులు ఎదుర‌య్యాయి. ఈ సినిమా విడుద‌లను ఆపాల‌ని బాధితురాలి కుటుంబీకులు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. తాజాగా దీనిపై విచార‌ణ జ‌రిగింది. ఈ సినిమాకు సెన్సార్ కూడా అయింద‌ని, ఇంకేం అభ్యంత‌రాలుంటాయ‌ని నిర్మాత‌లు కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చారు. ఐతే సినిమా విడుద‌ల‌ను ఇంకో రెండు వారాలు ఆపాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.

ఐతే దిశ ఎన్‌కౌంట‌ర్ సినిమా రిలీజ్ ఆగింద‌ని.. కోర్టులో అడ్డంకుల‌ని కూడా మీడియాలో ఎవ‌రూ పెద్ద‌గా రిపోర్ట్ చేయ‌ట్లేదు. ఈ సినిమా గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఐతే వ‌ర్మ మాత్రం ఈ సినిమా పెద్ద వివాదంలో చిక్కుకున్న‌ట్లు, మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రిగిపోతున్న‌ట్లు తాజాగా వ‌రుస‌బెట్టి ట్వీట్లు వేశాడు. ఈ సినిమా గురించి ఊహాగానాల గురించి తాను క్లారిటీ ఇవ్వ‌ద‌లుచుకున్నాన‌ని.. రెండు నెల‌ల ముందే దీనికి సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని, అన్ని ర‌కాల న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులూ తొల‌గిపోయాక సినిమాను రిలీజ్ చేస్తామ‌ని ఆయ‌నన్నాడు. ఐతే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయిన‌ప్ప‌టి నుంచి వ‌ర్మ ఎంత హ‌డావుడి చేస్తున్న‌ప్ప‌టికీ ఈ చిత్రం జ‌నాల దృష్టినైతే ఆక‌ర్షిస్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.