మైత్రి ఆఫర్ వద్దనుకుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత పెళ్లి తరువాత తన రూట్ ని మార్చుకుంది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గ్లామరస్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘యూటర్న్’, ‘మజిలీ’ లాంటి సినిమాలు ఆమెకి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇకపై కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటుందో ఏమో కానీ ఆ తరహా కథలు తన దగ్గరకు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట.

ఈ మధ్య మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమా కోసం సమంతను హీరోయిన్ గా అడిగారట. కానీ ఆమె మాత్రం సున్నితంగా ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. గతంలో సమంత ఇదే బ్యానర్ లో ‘రంగస్థలం’, ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాల్లో నటించింది. ‘రంగస్థలం’ సినిమా ఆమెకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. అయినప్పటికీ మైత్రి ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించిందట. దీనికి కారణం ఆమె కొంతకాలం పాటు కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకోవడమే.

ప్రస్తుతం సమంత ఫోకస్ మొత్తం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ కథలు తన దగ్గరకు వస్తున్నా.. అందులో మంచి కాన్సెప్ట్ ఉంటేనే ఒప్పుకుంటుంది. ఆ విధంగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలనుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.