పదవులపై జగన్ కీలక నిర్ణయం

అధికారంలోకి వచ్చి రెండేళ్ళయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పదవుల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని సుమారు 80 కార్పొరేషన్లలో ఛైర్మన్లుగా నియమించాలని డిసైడ్ అయ్యారు. ఛైర్మన్లకు తోడు పై కార్పొరేషన్లలో సగటున 12 మంది డైరెక్టర్లు అంటే మరో 960 మందిని నియమించబోతున్నారు.

ఛైర్మన్లు, డైరెక్టర్లుగా తమను నియమిస్తారని చాలామంది సీనియర్ నేతలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అప్పుడొకటి ఇప్పుడొకటి కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించటం తప్ప గుండుగుత్తగా నియమించలేదు. బీసీలకు సంబంధించిన 56 కార్పొరేషన్లకు మాత్రం ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారంతే. అవంటే సామాజికివర్గాల వారీగా భర్తీ చేసిన కార్పొరేషన్లు.

ఇప్పుడు భర్తీ చేయాలని డిసైడ్ అయిన కార్పొరేషన్లన్నీ దశాబ్దాలుగా ప్రభుత్వంలో ఉంటున్నవే. పార్టీ తరపున ఇప్పటికే ఐదుగురు ప్రాంతీయవారీ బాధ్యులతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ కోసం పనిచేసిన వారెవరనే విషయంలో వారినుండి నేతల జాబితాను తీసుకున్నారు. డైరెక్టర్లుగా నియమించాల్సిన వారి పేర్లను కూడా సామాజికవర్గాల వారీగా ఖారారు చేశారట.

ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించే వారికి స్పష్టమైన గైడ్ లైన్స్ పెట్టుకున్నారట. అవేమిటంటే మొన్నటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు. వివిధ కారణాల వల్ల పోటీచేయలేక ఇతరులకు టికెట్ ను వదులుకున్నవారు. మూడోది పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం బాగా కష్టపడినవారు. డైరెక్టర్ల విషయంలో ఒక స్పష్టమైన పద్దతి పెట్టుకున్నారు. అదమిటంటే 2017 నుండి పార్టీలో పనిచేసుండాలంతే.

ఒక్కో ఎంఎల్ఏ నలుగురు డైరెక్టర్లను సిఫారసు చేయవచ్చు. అంటే 600 మంది డైరెక్టర్లను అచ్చంగా ఎంఎల్ఏల సిఫారసుల మీదే భర్తీ చేస్తారన్నమాట. అంటే ఎంఎల్ఏల సిఫారసులకు విలువిచ్చినట్లుంటుంది. అలాగే మిగిలిన డైరెక్టర్లను మంత్రులు, సీనియర్ నేతల సిఫారసు ఆధారంగా తీసుకున్నట్లవుతుంది. మొత్తానికి పదవుల జాతర మొదలైతే పార్టీ నేతల్లో జోష్ పెరిగిపోవటం ఖాయమనే చెప్పాలి.