‘కర్ణన్’ రీమేక్ చేజారినట్లే!

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఆ తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుందా’ లాంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలతో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్నారు. అయితే మహేష్ బాబు హీరోగా తీసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అసురన్’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘నారప్ప’ అనే పేరుతో రూపొందిస్తున్నారు.

ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘కర్ణన్’ రీమేక్ ముందుగా ఆయన చేతుల్లోకి వచ్చింది. అలానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ‘కర్ణన్’ రీమేక్ చేయడానికి ఆయన ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి కారణం గీతాఆర్ట్స్ సంస్థ అని తెలుస్తోంది. నిజానికి చాలా రోజుల క్రితం గీతాఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ అడ్డాలకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి అతడిని లాక్ చేసింది.

నిజానికి ‘నారప్ప’ సినిమా కంటే ముందు గీతాఆర్ట్స్ సంస్థలో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయాలి. కానీ వారు పర్మిషన్ ఇవ్వడంతో బయట బ్యానర్ లో సినిమా చేశారు. ఈసారి మాత్రం తమ బ్యానర్ లోనే సినిమా చేయాలని గీతాఆర్ట్స్ డిమాండ్ చేస్తోందట. దీంతో శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆప్షన్ లేక ‘కర్ణన్’ రీమేక్ ను పక్కన పెట్టారని సమాచారం. ఇప్పుడు ఈ రీమేక్ కోసం దర్శకుడు వినాయక్ కు సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.