సంచ‌ల‌నంః దేశంలో మ‌రో మూడు కొత్త రాష్ట్రాలు!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా? మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు భిన్న‌మైన నిర్ణ‌యం జ‌ర‌గ‌బోతోందా? అంటే అవున‌నే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు, క్యాబినెట్ విస్తరణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని చెప్తున్నప్పటికీ అస‌లు కథ యూపీని విభ‌జించ‌డ‌మ‌ని అంటున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అక్క‌డి ప‌రిస్థితిని సెట్ రైట్ చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. యూపీ ఎన్నిక‌ల‌పై అమిత్‌షా ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెప్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు, మాజీ బ్యూరోక్రాట్ అయిన ఏకే శర్మను ఉత్తరప్రదేశ్‌కు పంపి అత‌డిని శాసనమండలి సభ్యుడిగా చేయడం కూడా దీనికి ముడిపడి ఉన్న‌ట్లుగా తెలుస్తున్న‌ది. ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కరోనా నిర్వహణ ప‌నుల‌ను శర్మ కొంతకాలంగా చూస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ అంద‌క‌పోవ‌డం, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం, అభివృద్ధి లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యావ‌కాశాలు మందగించిపోయాయి. దాంతో రాష్ట్రాన్ని రెండు లేదా మూడు ముక్క‌లుగా చేసి మ‌రోసారి అక్క‌డ త‌మ హ‌వా త‌గ్గ‌లేద‌ని నిరూపించుకోవాల‌న్న ప‌నిలో బీజేపీ నిమ‌గ్న‌మై ఉందంటున్నారు.

యూపీలో ప్రత్యేక పూర్వంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం, గోరఖ్‌పూర్ సహా 23 నుంచి 25 జిల్లాలను పూర్వాంచల్ రాష్ట్రంగా ఏర్పాటు చేయ‌వ‌చ్చు. ఇందులో 125 అసెంబ్లీ సీట్లు కూడా ఉంటాయి. అయితే, ఈ అంశాలపై యోగి శిబిరం అంగీకరించడం లేదని చెప్తున్నారు. యూపీ విభ‌జ‌న విష‌యంపై చ‌ర్చించేందుకు యోగి ఆదిత్య‌నాథ్ గ‌త రెండు రోజులుగా ఢిల్లీలో మ‌కాం వేసి ప్ర‌ధాన‌మంత్రి మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌తో సుదీర్ఘంగా చ‌ర్చిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.