మాజీ భార్యపై శిల్పా శెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు


బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి.. పన్నెండేళ్ల కిందట వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడటం అప్పట్లో చర్చనీయాంశమే. అప్పటికే రాజ్‌కు పెళ్లయింది. మొదటి భార్య కవితతో 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నాడతను. వారికో బిడ్డ కూడా పుట్టింది. ఐతే శిల్పాతో పరిచయమయ్యాక ఆమెతో కలిసి ఐపీఎల్ జట్టును నడిపించడం, కొంత కాలానికి ఆమెను పెళ్లాడటం చకచకా జరిగిపోయాయి.

ఐతే మొదటి భార్య నుంచి రాజ్ విడిపోవడానికి కారణం శిల్పానే అని, ఆమె మాయలో పడి కవితకు రాజ్ విడాకులు ఇచ్చాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రచారం కొనసాగుతూనంది. ఐతే ఈ ప్రచారాన్ని రాజ్ ఖండించాడు. తన మొదటి భార్య నుంచి తాను విడాకులు తీసుకోవడానికి శిల్పా ఎంతమాత్రం కారణం కాదన్నాడు. కవితకు తన చెల్లెలి భర్తలో సంబంధం ఉందని తేలడంతోనే తాను విడాకులు తీసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడతను. దీని గురించి అతను వివరంగా మాట్లాడాడు ఇంటర్వ్యూలో.

‘‘అప్పట్లో మేం లండన్‌లో ఉండేవాళ్లం. నాతో పాటు నా తల్లిదండ్రులు.. నా చెల్లెలు, తన భర్త కూడా ఉండేవాళ్లు. ఐతే కవిత.. నా చెల్లెలి భర్తతో సంబంధం పెట్టుకుంది. నేను వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్తే కవిత ప్రవర్తన మారిపోయేది. నా చెల్లెలి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. ఆఖరికి మా కారు డ్రైవర్‌ సైతం వాళ్ల గురించి అసభ్యంగా చెప్పాడు. దీంతో మా చెల్లిని, తన భర్తను భారత్‌కు పంపించేశాం. అయినా సరే కవిత అతడితో మాట్లాడడం మానలేదు. రహస్యంగా ఒక మొబైల్ కొనుగోలు చేసి దాని నుంచి అతనికి తరచూ మెసేజ్‌లు పంపేది. ఒకసారి ఆ ఫోన్ నా కంటపడింది. అందులో మెసేజ్‌లు చూసి నా గుండె బద్దలైంది. దీంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అనంతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. నా విడాకులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. నా గురించి శిల్పాకు అన్నీ తెలుసు. అలా, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అని రాజ్ కుంద్రా తెలిపాడు.