‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుతం.. అంతే


ఒక భారీ విజయం తర్వాత నెలకొనే అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. అందులోనూ వరుసగా కొన్ని విజయాలందుకున్నా ఆ ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. ఆ అంచనాల ఒత్తిడికి చిత్తయి డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులు చాలామందే ఉన్నారు. మహా మహా దర్శకులు కూడా ఇలా తప్పటడుగులు వేసిన సందర్భాలు బోలెడు. కానీ టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం ఇందుకు మినహాయింపు. రెండు దశాబ్దాలుగా తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ మొదలుకుని పరాజయం ఎరుగకుండా సాగిపోతున్నాడు జక్కన్న.

‘సై’ సినిమా ఒకటి ఓ మోస్తరుగా ఆడింది తప్పితే.. జక్కన్న కెరీర్లో మిగతావన్నీ సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లే. చివరగా ఆయన తీసిన ‘బాహుబలి’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో జక్కన్న క్రేజ్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఐతే ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా నెలకొన్న అంచనాలను అందుకోవడం మాత్రం జక్కన్నకు తేలిక కాదనే భావించారు గతంలో.

కానీ ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి అబ్బురపరిచేలాగే కనిపిస్తున్నాడు జక్కన్న. తన సినిమా గురించి రాజమౌళి ఏమీ గొప్పలు పోవడం లేదు కానీ.. అందులో భాగమైన వాళ్లు మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఓ రేంజిలో చెబుతున్నారు. ఇప్పటికే హీరో ఎన్టీఆర్, కథకుడు విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’లో కొన్ని ఘట్టాల గురించి ఓ రేంజిలో చెప్పారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో వ్యక్తి వచ్చారు. ఆయనే.. సాయిమాధవ్ బుర్రా. ఈ టాప్ రైటర్ ‘ఆర్ఆర్ఆర్’కు మాటలు రాస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుతం అనేశారాయన. ఆ చిత్రం అసాధారణ విజయం సాధిస్తుందని.. దానికి అసలు ఎల్లలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. రాజమౌళి ఈ సినిమా కథను తనకు చెబుతున్నపుడే విజువలైజ్ చేసుకున్నానని, ఇదొక అద్భుత చిత్రం అవుతుందని అప్పుడే నమ్మకం కలిగిందిన ఆయనన్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పాత్రలు ఎలా ఉంటాయి, రెండింటినీ బ్యాలెన్స్ చేశారా అని అడిగితే.. ఆ విషయంలో అభిమానులు కంగారు పడాల్సిన పనేమీ లేదని, రెండు పాత్రలూ అద్భుతంగా ఉంటాయని.. ఏదీ తగ్గదని.. రాజమౌళి తనదైన శైలిలో వాటిని బ్యాలెన్స్ చేశారని సాయిమాధవ్ అన్నారు.