మండలి ఛైర్మన్ ఈయనేనా ?

శాసనమండలి ఛైర్మన్ గా ఎవరిని నియమించాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి నాలుగుపేర్లు గవర్నర్ పరిశీలనకు పంపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటినుండి పదవుల భర్తీలో సామాజికవర్గాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్న జగన్ ఈ జాబితా విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించినట్లు సమాచారం.

కడప జిల్లాలో బీసీ నేత రమేష్ యాదవ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్సీ నేత కొయ్య మోషేన్ రాజు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత తోట త్రిమూర్తులు, గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత లేళ్ళ అప్పిరెడ్డి పేర్లతో గవర్నర్ దగ్గరకు ఫైల్ వెళ్ళిందట. ఈరోజో లేకపోతే రేపో గవర్నర్ ఫైలును ఆమోదిస్తారని పార్టీ నేతలు చెప్పారు. కాబట్టి పై నలుగురు ఎంఎల్సీలైపోవటం ఖాయం.

సరే నలుగురు ఎంఎల్సీలైపోయారు బాగానే ఉంది. కానీ ఖాళీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్ గా ఎవరిని నియమించబోతున్నారు ? ఇపుడిదే అంశం సస్పెన్సుగా మారింది. ఈమధ్యనే రిటైర్ అయిన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ముస్లిం మైనారిటి నేత కాబట్టి తొందరలో జగన్ ఫైనల్ చేయబోయే ఛైర్మన్ కూడా ముస్లిం నేతే అవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కొత్తగా ఎంపిక కాబోతున్న మోషేన్ రాజునే ఛైర్మన్ పదవి వరించబోతోందట. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేశారు. 2014లో టికెట్ కోసం ప్రయత్నించినా దక్కకపోవటంతో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో చేరిన రెండు నెలలకే మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. మళ్ళీ 2019లో టికెట్ ఆశించి భంగపడినా పార్టీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇస్తానన్న జగన్ హామీ దక్కింది.

దాంతో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఇపుడు మోషేన్ ఫలితం అందుకోబోతున్నారట. ఎంఎల్సీతో పాటు మండలి ఛైర్మన్ కూడా మోషేన్ కే దక్కబోతోందని నేతలంటున్నారు. ఎలాగూ అసెంబ్లీ స్పీకర్ గా ఉత్తరాంధ్ర బీసీ నేత తమ్మినేని సీతారామ్ ఉన్నారు. కాబట్టి మండలి ఛైర్మన్ గా గోదావరి జిల్లా ఎస్సీకి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని టాక్. మొత్తానికి మోషేన్ రాజు భలే లక్కీ అనే చెప్పుకోవాలి.