మోడి, షా కు ‘ మమత ‘ టెన్షన్

ఫిరాయింపులంటే పిరాయింపులే అనటంలో రెండో సందేహం లేదు. ఎందుకంటే తమ అవసరాలు తీరుతాయని అనుకుంటే పార్టీలో ఉంటారు లేకపోతే లేదంతే. ఇపుడీ విషయం పశ్చిమబెంగాల్ విషయంలో మరోసారి రుజువవుతోంది. మొన్నటి ఎన్నికలకు ముందునుండి బీజేపీ ఫిరాయింపులకు తెరెత్తింది. మమతాబెనర్జీని దెబ్బ కొట్టడమే టార్గెట్ గా తృణమూల్ కాంగ్రెస్ నుండి కొందరు నేతలను ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేసి బీజేపీలోకి లాక్కున్నది.

తృణమూల్ కు చెందిన 29 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలతో పాటు అనేకమంది కీలక నేతలను కమలం లాగేసుకున్నది. అయితే అందరు ఊహించినట్లు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. బంపర్ విజయంతో మళ్ళీ మమతే మూడోసారి సీఎం అయ్యారు. దాంతో ఫిరాయింపులు బీజేపీలో ఇమడలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ తృణమూల్లో చేరిపోదామా ? అని తెగ ప్రతయ్నాలు చేసుకుంటున్నారు. ఇపుడీ సమస్యే నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు బెంగాల్ బీజేపీకి కునుకుపట్టనీయకుండా చేస్తోంది.

కీలక నేత ముకుల్ రాయ్ తో పాటు సుమారు 10 మంది ఎంఎల్ఏలు+సీనియర్ నేతలు బీజేపీని వదిలేసేందుకు రెడీగా ఉన్నారట. ఈ విషయం తెలియగానే బీజేపీ అగ్రనేతలు ఫిరాయింపులను తమ పార్టీలో అట్టే పెట్టుకునే విషయంలో నానా తంటాలు పడుతున్నారట. ఫిరాయింపులకు ముందు వారికిచ్చిన హామీలతో పాటు మరికొన్నింటినీ నెరవేరుస్తామంటు ఆశలుపెడుతున్నారట.

అయితే ముకుల్ రాయ్ లాంటి వాళ్ళు ఇప్పటికే తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారట. అప్పుడేమో ఫిరాయింపులకు ప్రలోభపెట్టారు. ఇపుడేమో బీజేపీలోనే అట్టేపెట్టుకోవటానికి ప్రలోభాలకు తెరలేపారు. ఇన్ని ప్రలోభాలు చూపిస్తున్నా ఫిరాయింపులు బీజేపీలోనే ఉంటారా అన్నది గ్యారెంటీలేదు. ఎంఎల్ఏలు+నేతలు కలిసి 35 మంది తృణమూల్లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే మరో ఐదేళ్ళ మమత అధికారం ఫిరాయింపులను బీజేపీలో నిలవనీయటంలేదు. దాంతో ఏరోజు కీలక నేతలు వెళిపోతారో ? ఏరోజు ఎంతమంది ఎంఎల్ఏలు బీజేపీకి రాజీనామా చేస్తారో తెలీక కమలం అగ్రనేతలు నానా టెన్షన్ పడుతున్నారట. నిజంగా అదేగనుక జరిగితే మోడి, అమిత్ షా పరువంతా గంగానదిలో పోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఫిరాయింపులకు లాకులెత్తిందే వాళ్ళిద్దరే కాబట్టి.