అన్ని ‘వుడ్‌’లనూ దున్నేస్తోంది

టాలీవుడ్లో రాశి ఖన్నా కెరీర్ ఎప్పుడూ ఒక పద్ధతిలో సాగలేదు. ఒక్కోసారి ఆమె మంచి ఊపులో కనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి డౌన్ అవుతుంది. మూడేళ్ల కిందట ‘తొలి ప్రేమ’ సినిమా చూసి ఆమె పెద్ద రేంజికి వెళ్లబోతోందనుకున్నారు. కానీ తర్వాత పరాజయాలు ఆమె కెరీర్‌ను కిందికి లాగాయి.గత ఏడాది ‘వరల్డ్ ఫేమస్’ లవర్‌తో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాక ఆమెకు తెలుగులో ఛాన్సులే రాని పరిస్థితి నెలకొంది. కానీ ఆ గ్యాప్ ఎంతో కాలం కొనసాగలేదు. స్వల్ప వ్యవధిలో రెండు క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుందామె.

విక్రమ్ కుమార్-నాగచైతన్య కలయికలో తెరకెక్కుతున్న ‘థ్యాంక్ యు’తో పాటు మారుతి-గోపీచంద్‌ల సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది. మరోవైపు హిందీ, తమిళంలోనూ ఆమె మంచి మంచి కాంబినేషన్లలోనే సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలు వెల్లడించింది.

ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో రాశి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో తన సినిమా ఒకటి ఖరారైందని రాశి వెల్లడించింది. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుందని చెప్పింది. అలాగే హిందీలో మరో స్టార్‌తోనూ సినిమా ఓకే అయిందని, దాని గురించి మేకర్సే ప్రకటిస్తారని చెప్పింది. ఇక తమిళంలో ఆమె మూడు సినిమాలు చేస్తుండటం విశేషం.

ప్రస్తుతం కార్తితో పాటు ఆర్యా హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ రాశి నటిస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన ‘తుగ్లక్ దర్బార్’ విడుదలకు సిద్ధమైంది. ఇక మలయాళ సినీ పరిశ్రమలోకి కూడా రాశి అరంగేట్రం చేస్తుండటం విశేషం. అక్కడి అగ్ర కథానాయకుల్లో ఒకడైన పృథ్వీరాజ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోందట రాశి. ఇలా ఒకేసారి నాలుగు ప్రముఖ ఇండస్ట్రీల్లో పని చేస్తున్న అరుదైన కథానాయికల్లో రాశి ఒకరుగా ఉండటం విశేషమే.