అఫ్రిది నోటి దురుసు.. గడ్డి పెట్టిన గంభీర్

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిది అఫ్రిది ఈ మధ్యే తమ దేశంలో అభాగ్యుల్ని ఆదుకునేందుకు చేపట్టిన సేవా కార్యక్రమానికి సాయం చేయమంటూ భారత సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్‌ సింగ్‌లను విన్నవించడం.. వాళ్లు అతడి విన్నపాన్ని మన్నించి విరాళాల సేకరణకు సాయం చేయడం తెలిసిందే.

ఐతే భారతీయుల సహకారం కోరుతూ, అప్పుడప్పుడూ భారత్, పాక్ మధ్య సౌభ్రాతృత్వం గురించి మాట్లాడే అఫ్రిది.. కొన్నిసార్లు ఇండియా మీద విషం కక్కుతుంటాడు. తాజాగా అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించి.. అక్కడ భారత్ గురించి, మన ప్రధాని నరేంద్ర మోడీ గురించి అవాకులు చెవాకులు పేలాడు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా అనే ప్రమాదకర వైరస్ కారణంగా భయపడుతోందని.. ఐతే దాన్ని మించిన వైరస్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బుర్రలో ఉందని వ్యాఖ్యానించాడు అఫ్రిది.

కాశ్మీర్ పాక్ సొంతమని.. పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో కాశ్మీర్ జట్టుకు కూడా అవకాశం ఇవ్వాలని.. తాను చివరి సీజన్ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఆడాలనుకుంటున్నానని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్‌తో పాటు యువరాజ్, హర్భజన్ మండిపడ్డారు. ముఖ్యంగా అఫ్రిదితో ఎప్పట్నుంచో శత్రుత్వం ఉన్న గంభీర్ అతడికి బాగానే గడ్డి పెట్టాడు. అఫ్రిదిని ఒక జోకర్ గా అభివర్ణించాడు గంభీర్.

ఆత్మకథలో అఫ్రిది జన్మదిన విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని దెప్పిపొడుస్తూ.. 16 ఏళ్ల అఫ్రిది పాకిస్థాన్ దగ్గర 7 లక్షల మంది సైన్యం ఉన్నట్లు చెబుతున్నాడు. కానీ 70 ఏళ్లుగా కాశ్మీర్ కోసం వాళ్లు అడుక్కుంటూనే ఉన్నారు. జోకర్ లాంటి అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్ భారత్ మీద విషం కక్కుతున్నారని.. కానీ కాశ్మీర్ పాక్ సొంతం ఎప్పటికీ కాదని.. బంగ్లాదేశ్ విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని అన్నాడు గంభీర్. మరోవైపు యువరాజ్, హర్భజన్ సైతం అఫ్రిదికి దీటుగా బదులిచ్చారు. ఇకపై అతడికి ఎలాంటి సాయం చేయమని, అతడితో సంబంధాలు తెంచుకుంటున్నామని అన్నారు.