సుశీల్ దారుణాలు బయటపెట్టేశాడు..

రెజ్లర్ గా మాంచి పేరు ప్రఖ్యాతులతో పాటు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న క్రీడాకారుడు సుశీల్ కుమార్. అతగాడి మీద ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఎప్పుడూ లేని విధంగా అతడి మీద హత్య కేసు నమోదు కావటం.. పోలీసులు గాలించే వరకు విషయం వెళ్లటం.. పరారీలోకి వెళ్లిన అతడిప్పుడు కటకటాల వెనుకకు వెళ్లి ఊచలు లెక్కేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు హత్య చేసే వరకు ఎందుకు వెళ్లాడు? ఈ గొడవలన్నింటికి కారణం ఏమిటి? యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య ఎలా జరిగింది? లాంటి విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. తాజాగా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి.. మరణించిన రెజ్లర్ సాగర్ మిత్రుడు సోనూ మొత్తం వివరాల్ని వెల్లడించాడు. అతడు చెప్పిన విషయాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

రెజ్లర్ సుశీల్ కుమార్ కు కట్టలు తెంచుకునే కోపం ఎందుకు వచ్చిందన్న విషయానికి వస్తే.. అతని అత్యాశే అతని కొంప ముంచిందని చెప్పాలి. ఛత్రసాల్ స్టేడియం కోచ్ వీరేంద్ర నంగోలిలో సొంతంగా రెజ్లింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు.అతనికి సాగర్ సాయం చేశాడు. ఈ సెంటర్ కు సుశీల్ వద్దకు శిక్షణ పొందే 50 – 60 మంది రెజ్లర్లు వెళ్లిపోయారు. దీన్ని సుశీల్ తట్టుకోలేకపోయాడు. తనకు జరిగిన దానికి బదులు తీర్చుకోవాలని రగిలిపోయాడు.

దీంతో కోపంతో ఊగిపోతూ.. ఛత్రసాల్ స్టేడియం కోచ్ వీరేంద్ర వద్దకు వెళ్లి అతన్ని బయటకు తీసుకొచ్చి మరీ చితకబాదాడు. అతనికి సాయం చేస్తున్న సాగర్ తో సహా కీలకమైన ఐదుగురి చిరునామాల్ని అడిగి తెలుసుకున్నాడు. వారెవరిని తాను వదిలిపెట్టనంటూ ఆగ్రహాన్నివ్యక్తం చేశాడు. మే నాలుగున సాగర్ కోసం సుశీల్ తీవ్రంగా గాలించాడు. అయినా దొరకలేదు. దీంతో.. మిగిలిన వారి కోసం గాలించసాగాడు. ఈ క్రమంలో సాగర్ తో పాటు మిగిలిన ఐదుగురు దొరికారు. వారందరిని బంధించాడు.

సాగర్ కనిపించినంతనే అతడ్ని తీవ్రంగా కొట్టి గాయపరిచాడు సుశీల్. నన్ను (సోనూ) కూడా గాయపర్చాడు. దీంతో.. ఆసుపత్రిలో చేరాం. అనంతరం అమిత్.. రవీంద్రను బంధించాడు. వారిని కొట్టటంతో మిగిలిన వారి అడ్రస్ లు వారిద్దరు చెప్పేశారు. ఈ క్రమంలోనే భగత్ సింగ్ అనే రెజ్లర్ ను సుశీల్ బంధించి రాత్రంతా కొట్టాడు. అతడి భార్య మే ఐదున తన భర్తను అపహరించుకు వెళ్లినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న సుశీల్ భగత్ సింగ్ భార్యకు అతని చేత ఫోన్ చేయించి.. తాను కిడ్నాప్ కాలేదని.. తానున బాగానే ఉన్నట్లుగా వీడియో కాల్ లో చెప్పించాడు. అయితే.. అతడి భార్యకు నమ్మకం కలగలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులకు విషయం వెళ్లిందన్న వెంటనే.. అతడ్ని సుశీల్ వదిలేశాడు. ఆసుపత్రిలో చేరిన తనకు చేతులు విరిగినట్లుగా చెప్పిన వైద్యులు సర్జరీ చేసినట్లు సోనూ చెప్పాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్నంతనే సుశీల్ పరారీ అయ్యాడు. పోలీసుల కారణంగా పది రోజులకు దొరికినట్లుగా పేర్కొన్నాడు.