థియేటర్లు తెరిస్తే ఆ హీరోది జాతరే

కరోనా దెబ్బకు ఏడాది నుంచి భారతీయ సినీ పరిశ్రమ ఎంతగా కుదేలవుతుందో తెలిసిందే. ఏడాది వ్యవధిలో థియేటర్లు నడిచింది చాలా తక్కువ సమయం. షూటింగ్స్ చాలా కాలం పాటు ఆగిపోయాయి. అందులోనూ మిగతా పరిశ్రమలతో పోలిస్తే హిందీ సినిమా పరిశ్రమ ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్‌కు కేంద్రమైన ముంబయి.. కరోనా కారణంగా దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో ఒకటి కావడంతో బాలీవుడ్ కష్టాలు మామూలుగా లేవు. ఏడాది వ్యవధిలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. వాటిలో భారీ చిత్రాలు చాలానే ఉన్నాయి. మధ్యలో థియేటర్లు కొన్ని నెలలు నడిచినా కూడా.. భారీ హిందీ చిత్రాలేవీ కూడా విడుదల కాలేదు. ఐతే కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు తగ్గుముఖం పట్టడం.. దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతుండటం.. ఆరోగ్య సౌకర్యాలు కొంచెం మెరుగపడటంతో ఇక ముందు కరోనా ముప్పు పెద్దగా ఉండదని భావిస్తున్నారు.

ఈసారి థియేటర్లు తెరుచుకున్నాక బాలీవుడ్ భారీ చిత్రాలను థియేటర్లలోకి దించేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఒరవడి మొదలయ్యాక హిందీ ఇండస్ట్రీని పైకి లేపాల్సిన బాధ్యత ప్రధానంగా అక్షయ్ కుమార్ మీదే ఉంది. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత కలిపితే అక్షయ్ నుంచి అరడజను సినిమాలు రెడీ అవుతుండటం విశేషం. గత ఏడాది కరోనా కంటే ముందే ‘సూర్యవంశీ’ చిత్రాన్ని పూర్తి చేశాడు అక్షయ్. అప్పటికే ‘బెల్‌బాటమ్‌’ను మొదలు పెట్టి ఉన్న అక్షయ్.. లాక్ డౌన్ టైంలోనే యూరప్‌కు వెళ్లి ఆ సినిమాను ముగించుకుని వచ్చాడు. తర్వాత ‘ఆత్రంగి’ పని పూర్తి చేశాడు.

ఆపై ‘బచ్చన్ పాండే’, ‘రక్షాబంధన్’, రామ్ సేతు’ సినిమాలు లైన్లోకి వచ్చాయి. వీటిలో తొలి రెండు చిత్రాలు పూర్తి కావచ్చాయి. మరికొన్ని రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రాబోతున్న అక్షయ్.. సాధ్యమైనంత త్వరగా ఈ మూడు చిత్రాలను ముగించాలనుకుంటున్నాడు. ఇవి కాక ‘పృథ్వీ రాజ్’ అనే భారీ చిత్రం కూడా అక్షయ్ చేతిలో ఉంది. సాధ్యమైనంత త్వరగా దీన్ని కూడా పూర్తి చేయాలనుకుంటున్నాడు. మళ్లీ థియేటర్లు తెరుచుకుని పెద్ద సినిమాల సందడి మొదలైతే అక్షయ్ నుంచి రెండు నెలలకో సినిమా రావడం ఖాయం. మిగతా పెద్ద హీరోలంతా వచ్చే ఏడాదిలో ఒకట్రెండు సినిమాలకు మించి రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అక్షయ్ సినిమాల మీద ఉండే అంచనాల దృష్ట్యా బాలీవుడ్‌ను పైకి లేపే బాధ్యత అతడి మీదే ఉందంటే అతిశయోక్తి కాదు.