బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాహుల్ గాంధీ సన్నిహితుడు

రోజు రోజుకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో దారుణంగా తయారౌతోంది. ఓ వైపు బీజేపీ బలపడుతుంటే.. మరో వైపు కాంగ్రెస్ బలహీనపడుతోంది. దీనికి తోడు.. తాజాగా… రాహుల్ గాంధీకి ఊహించని షాక్ ఎదురైంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ .. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువ నేత జితిన్ ప్రసాద బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గత ఏడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితేంద్ర 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు. బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.