కేసీఆర్ దూకుడు.. కృష్ణాన‌దిపై కీల‌క ప్రాజెక్టు.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు అంద‌రికీ తెలిసిందే. మేం ఇద్ద‌రం ఒక‌టే.. అని బాహాటంగా ప్ర‌క‌టించుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు.. న‌దులు, నీళ్ల విష‌యానికి వ‌చ్చే స‌రికి ఎవ‌రి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు వారే చూసుకున్నారు. ఇప్ప‌టికీ వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. తాజాగా కృష్ణాన‌దిపై సోమ‌శిల ప్రాజెక్టు వ‌ద్ద‌.. కేసీఆర్ ఓ వంతెన నిర్మాణానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు గుప్పు మంటున్నాయి.ఈ వంత‌నె నిర్మాణం పూర్త‌యితే.. హైద‌రాబాద్-క‌ర్నూలు మ‌ధ్య దూరం త‌గ్గిపోవ‌డంతోపాటు ప్ర‌యాణ స‌మ‌యం క‌లిసి వ‌స్తుంద‌ని.. ఇది ఉభ‌య తార‌కంగా ఉంటుంద‌ని తెలంగాణ అధికారులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎలాగంటే..

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణానదిపై సోమశిల వద్ద అధునాతన వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని క‌ర్నూలు జిల్లా నంద్యాల వరకు జాతీయ రహదారి అనుసంధానానికి కేంద్రం అనుమతించింది. మొత్తం 165 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి 85 కిలోమీటర్లు తెలంగాణలో, 80 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వారికి సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా సోమశిల వద్ద కృష్ణాన‌దిపై భారీ వంతెన నిర్మించాల‌ని తెలంగాణ స‌ర్కారు భావిస్తోంది.

600 కోట్లు వెచ్చించ‌నున్న తెలంగాణ‌

తెలంగాణలో 85 కిలోమీటర్ల రహదారితో పాటు వంతెన నిర్మాణానికి సుమారు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. ఇందులో రూ.600 కోట్లు వంతెనకే కేటాయించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని అధునాతనంగా నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంగా ఉంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెనను హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్మించిన హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌ తరహాలో నిర్మించాలా? లేదా సస్పెన్షన్‌ తరహాలో నిర్మించాలా? అన్న విషయంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

జ‌గ‌న్ వ్యూహం ఏంటి?
తెలంగాణ ప్ర‌తిపాదిత సోమశిల వంతెన విష‌యం ఏపీ ప్ర‌భుత్వానికి కూడా చెప్పామ‌ని తెలంగాణ అధికారులు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వంతెన ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉంటుంది క‌నుక ఏపీ ప్ర‌భుత్వం కూడా దీనికి ప‌చ్చ‌జెండా ఊపుతుంద‌ని.. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌యాణ సౌల‌భ్యం చేకూరి ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి మెసేజ్ లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దీనిపై ఏపీ అధికారులు కూడా అధ్య‌య‌నం చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న కేబినెట్ భేటీలో దీనిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే.. ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం రూపాయి కూడా ఇచ్చే అవ‌కాశం లేదని, ఇరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుగా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి జ‌గ‌న్ వ్యూహం ఏంట‌నేది వ‌చ్చే కేబినెట్ స‌మావేశం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.