గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష..!

జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఎక్కడైతే గాంధీ జేజేలు కొట్టించుకున్నాడో.. అక్కడే.. ఆమెకు ఇప్పుడు శిక్ష పడటం గమనార్హం. చీటింగ్, ఫోర్జరీ కేసులో గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

వ్యాపారవేత్తను మోసం చేసి రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను దోషిగా తేల్చుతూ డర్బన్ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. 56 ఏళ్ల ఆశిష్ లతా రామ్‌గోబిన్ వ్యాపారవేత్త మహరాజ్‌ను మోసం చేసినట్లు నిరుపితమైందని కోర్టు పేర్కొంది. ఆమెకు ఇండియా నుంచి వచ్చే ఓ కంటైన్‌మెంట్ కోసం ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్.. ఆమెకు అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చారు.

అనంతరం దాని ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుంది. అయితే.. అలాంటి కన్‌సైన్‌మెంటే లేదని.. నకిలీ బిల్లులు సృష్టించి… ఆమె ఆయనను మోసం చేసినట్లు వెల్లడి కావడంతో డర్బన్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే.. ఈ కేసు విచారణ 2015 నుంచి కొనసాగుతోంది. ఆశిప్ లతా ఈ కేసులో అరెస్ట్ అయ్యాక దక్షిణాఫ్రికా కరెన్సీ 50,000 ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి బెయిల్‌పై విడుదల అయ్యారు.

ఆశిష్ లతా.. న్యూ ఆఫ్రికా ఎలియాన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు డైరెక్టర్ ఎస్ ఆర్ మహరాజ్‌ ను కలిసిన అనంతరం అప్పు తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం లైనెన్ క్లాత్ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆశిష్ మహరాజ్‌కు తెలియజేశారు. ఇలా నగదు ఇచ్చినందుకు లాభాల్లో కొంత మొత్తాన్ని ఇస్తామని పేర్కొన్నారు. అయితే ఆమె నకిలీ ఇన్ వాయిస్ ఆధారంగా డబ్బు తీసుకున్నట్లు నిరూపితమైంది.