‘ప్రతాపరుద్రుడు’లో మహేష్ బాబు?

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎంతో డెడికేషన్ తో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అందుకే స్టార్ హీరోలు కూడా ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమా తరువాత గుణశేఖర్ మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. రానా ప్రధాన పాత్రలో ‘హిరణ్యకశ్యప’ చేయాలనుకున్నారు. కానీ దానికంటే ముందుగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా తరువాత ‘హిరణ్యకశ్యప’ పూర్తి చేస్తానని ఇటీవల గుణశేఖర్ వెల్లడించారు. అయితే దీంతో పాటు అతడి దగ్గర ‘ప్రతాపరుద్రుడు’ కథ సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఓ స్టార్ హీరోతో తీయాలనేది ఆయన ఆలోచన. ముందుగా ఈ కథను మహేష్ బాబుకి వినిపించాలని అనుకుంటున్నారు గుణశేఖర్. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలు చేశారు. ఈ మూడు చిత్రాల్లో ‘ఒక్కడు’ మాత్రం హిట్ అయింది. మిగిలిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. అయినప్పటికీ మహేష్ బాబు.. గుణశేఖర్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు.

నిజానికి ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ ని అడిగారు. ఆయన కూడా అంగీకరించారు కానీ ఆఖరి నిమిషాల్లో డేట్స్ కుదరక తప్పుకున్నారు. దీంతో భవిష్యత్తులో కచ్చితంగా సినిమా చేద్దామని మహేష్ మాటిచ్చారట. అందుకే గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథను మహేష్ తో తీయాలనుకుంటున్నారు. పైగా ఇప్పటివరకు మహేష్ ని ఈ తరహా పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మహేష్ గనుక ఒప్పుకోకపోతే ఆ కథను కూడా రానాతోనే చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!