ఏపీ సీఎంగా షర్మిల? ఈ వాదన వినిపించిందెవరో తెలుసా?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు. కాకుంటే.. రాజకీయ వర్గాలతో సన్నిహిత సంబంధాలతో పాటు.. ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలు.. అలా జరిగితే తర్వాతేం జరుగుతుందన్న విశ్లేషణ కొత్త వాదనలు తెర మీదకు వస్తుంటాయి. ఉత్తినే మాటలు చెప్పటమే కానీ.. ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా? అన్న సందేహం అక్కర్లేదు. ఆర్నెల్ల క్రితం.. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటే నవ్వి పోవటమే కాదు.. అలాంటి వార్తను బ్యానర్ గా పెట్టిన మీడియా సంస్థను ముక్క చివాట్లు పెట్టారు. ఆ సంస్థ ఎండీకి పోయే కాలం వచ్చిందని.. అందుకే అలాంటి ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తున్నారంటూ మండిపడ్డారు.

కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడమే కాదు.. ఏదో రోజు తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం ఖాయమన్న మాట ఆమె నోటి నుంచి వస్తోంది. అందులో సాధ్యాసాధ్యాలన్నది పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తారన్న విషయాన్ని గ్రహించిన మీడియా సంస్థను అభినందించాల్సిందే.ఇప్పుడు అదే మీడియా సంస్థకు చెందిన అధినేత సరికొత్త విశ్లేషణ చేశారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి షర్మిల అంటూ సంచలన వాదనను.. తాను వారాంతంలో రాసే కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏదో మాట వరసకు ఏపీ సీఎం షర్మిల అని తాను ఉత్తినే చెప్పటం లేదంటూ.. అదెలా సాధ్యమన్న విషయాన్ని విశ్లేషించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీకి ముఖ్యమంత్రిగా షర్మిల అయ్యే అవకాశం ఉందన్న ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. అదెలా సాధ్యమన్న విషయాన్నిఆయన మాటల్లోనే చదివితే బాగుంటుంది. ఎందుకంటే.. ఆయనేం అనుకున్నది యథాతధంగా చదవటమే మేలు. ఇంతకీ ఆయనేమన్నారంటే.. “జగన్‌కు అవినీతి కేసులో శిక్ష పడితే తమిళనాడు తరహా ప్రయోగాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో కమలనాథులు ఉన్నారని చెబుతున్నారు. జగన్‌తో ఆయన సోదరి షర్మిల తీవ్రంగా విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ పెద్దలు ఆమెను చేరదీసే అవకాశం లేకపోలేదు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే భార్య భారతిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతానని జగన్‌ రెడ్డి తన సన్నిహితులకు చెబుతున్నారు. అయితే కమలనాథుల ఆలోచన మరో రకంగా ఉందంటున్నారు”.

“అన్నాడీఎంకేను శశికళ చేతుల్లోంచి తప్పించినట్టుగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని కూడా జగన్‌ రెడ్డి కోరుకుంటున్నట్టుగా కాకుండా షర్మిలకు అప్పగించడానికి వ్యూహరచన చేస్తున్నారని ఢిల్లీ వర్గాల భోగట్టా. ధిక్కారమును సైతునా అని భావించే జగన్‌ రెడ్డి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి” అని పేర్కొన్నారు. ఈ విశ్లేషణ ఇప్పుడు సంచలంగా మారింది. అయితే.. ఇదంతా కూడా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కు సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించి.. ఆయనకు బెయిల్ రద్దు అయితేనే.. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది మర్చిపోకూడదు. ఇంతకీ అలాంటి పరిస్థితి ఉందా? అన్నది కాలమే సమాధానం ఇవ్వాలి.