షాకింగ్: కరోనా దెబ్బకు బీర్ కంపెనీల మూత


సీజన్ తో సంబంధం లేదు. టైం ఏదైనా కావొచ్చు. అబ్బాయ్.. అమ్మాయ్ అన్న తేడా లేదు. పార్టీ అన్నా.. చిన్నపాటి దావత్ అనుకుంటే.. మందు లేకున్నా బీర్ మాత్రం తప్పనిసరి అన్నట్లుగా ఉండేది. మాయదారి మహమ్మారి బీర్ ప్రియులకు తీరని ద్రోహమే చేసింది. చిల్ బీర్ కోసం తహతహలాడే వారంతా ఇప్పుడు ఆ పేరు చెబితే వద్దని దండం పెడుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చు.. ఇప్పటికైతే బీర్ వద్దని తేల్చి చెబుతున్నారు.

కరోనా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే బీర్ అమ్మకాలు తగ్గటం మొదలైంది. ఎండిన గొంతులోకి చల్లటి బీర్ కావాలని మనసు చెప్పినా.. ఆ కోరికను బలవంతంగా చంపేసుకుంటూ.. మంచి రోజులు మళ్లీ రావా? అప్పుడు రెండింతలు బీర్ తాగుదాం.. ఇప్పటికైతే వద్దు బాస్ అన్నట్లుగా ఉంటున్నారు. చల్లటి పానీయాలు తాగితే జలుబు.. దగ్గు వస్తుందన్న భయం.. బీర్ తాగితే ఆ లక్షణాలు ఎక్కడ వస్తాయో.. కరోనా ఎక్కడ వచ్చి పడుతుందన్న భయమే బీర్ కు దూరంగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు.

లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాల ముందు భారీగా జనాలు ఉంటున్నారు. లిక్కర్ సేల్ తగ్గట్లేదు కదా? అన్న సందేహం రావొచ్చు. జనాలు ఇప్పుడు మందు తాగుతున్నారు. కానీ.. బీర్ కు మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో.. వాటి అమ్మకాలు భారీగా పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది మేలో 23.22 లక్షల కేసులు బీర్ అమ్ముడైతే ఈ ఏడాది కేవలం 20 లక్షల కేసులే అమ్ముడయ్యాయి. తెలంగాణలోనే కాదు..దేశ వ్యాప్తంగా బీర్ అమ్మకాలు పడిపోయినట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

తగ్గిన డిమాండ్ తో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీర్ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. తెలంగాణలో తయారయ్యే బీర్ కర్ణాటక.. మహారాష్ట్రలకు భారీగా ఎగుమతి అవుతుంటుంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఆరు బీరు కంపెనీలు ఉంటే.. ఇప్పుడు నాలుగు కంపెనీలు ఉత్పత్తిని భారీగా తగ్గించేస్తే.. మరో కంపెనీలు అయితే ఏకంగా మూత పెట్టారు.
బీర్ బ్రాండ్లలో పేరున్న కజూర.. బడ్ వైజర్.. యూబీ కంపెనీలు గతంలో నెలకు 2 నుంచి 20 లక్షల కేసుల వరకు ఉత్పత్తి చేస్తే.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. కజుర్ బ్రాండ్ నెలకు 10వేల కేసులు.. బడ్ వైజర్ నెలకు 40 వేల కేసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. యూబీ నెలకు 4 లక్షల కేసులు మాత్రమే తయారు చేయటం గమనార్హం.

సంగారెడ్డి జిల్లాలోని కోత్లాపూర్ లోని యూబీ నిజాం కంపెనీ నెలలో మూడు రోజులు మాత్రమే బీర్ ఉత్పత్తి చేస్తుండటం చూస్తే.. దీని గిరాకీ ఎంతలా తగ్గిందన్నది ఇట్టే అర్థమవుతుంది. చార్మినార్ బ్రూవరీస్ కు చెందిన హైవార్డ్స్ 5000, రాయల్ చాలెంజ్ బీర్లను గతంలో భారీగా ఉత్పత్తి చేసేవారు. వేసవికాలంలోని మూడు నెలలు ఆ కంపెనీ నెలకు 14 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేసేది. అలాంటిది ఇప్పుడా కంపెనీ ఉత్పత్తిని భారీగా తగ్గించింది. అంతేకాదు.. మే 4 నుంచి ఉత్పత్తిని ఆపేసి..తన దగ్గర ఉన్న స్టాక్ అమ్ముకోవటం మీదనే ఫోకస్ పెట్టటం గమనార్హం.