8 కోట్ల డోసుల వెనుక అసలు కారణం ఇదేనా ?

తమ దగ్గర మిగిలిపోయిన 8 కోట్ల టీకాలను ప్రపంచదేశాలకు పంపిణీ చేయనున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జై బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బైడెన్ ప్రకటన రాగానే ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు అనేక దేశాల అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. ఇతర దేశాలకు అమెరికా సరఫరా చేయబోతున్న 8 కోట్ల టీకాల్లో మన దేశానికి రాబోతున్నది మ్యాగ్జిమమ్ 10 లక్షల టీకాలేనట.

అమెరికా నుండి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మెక్సికో, ధక్షిణకొరియా లాంటి దేశాలకు కూడా టీకాలు సరఫరా అవబోతున్నాయి. మొత్తం 8 కోట్ల టీకాల్లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు 2.5 కోట్ల టీకాలు అందుతాయి. వీటిలో ధక్షిణ, మధ్య అమెరికాకు 60 లక్షల డోసులు, ఆసియా దేశాలకు 70 లక్షలు, ఆఫ్రికా దేశాలకు మరో 50 లక్షలు సరఫరా అవబోతున్నాయి.

పైకేమో ప్రపంచదేశాలకు అమెరికా టీకాలను సరఫరా చేస్తోందని ప్రచారం జరుగుతున్నా అతర్లీనంగా పెద్ద రహస్యం దాగుందట. పేరుకు 8 కోట్ల డోసులను అమెరికా సరఫరా అవుతున్నా ఇందులో 6 కోట్ల డోసులు ఆస్ట్రాజెనికా కంపెనీ తయారుచేసిన (కోవీషీల్డ్) టీకాలేనట. అమెరికాలో వేస్తున్న టీకాలన్నీ మూడు కంపెనీలు ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసినవి మాత్రమే. మరి ఈ కోవీషీల్డ్ టీకాలు అమెరికాకు ఎలా వచ్చాయి ?

ఎలాగంటే ముందే అమెరికా చేసుకున్న ఒప్పందం కాబట్టి. పై మూడు కంపెనీల టీకాలు మార్కెట్లో పూర్తిస్ధాయిలో రాకముందే సీరమ్ కంపెనీ ఉత్పత్తి కోవీషీల్డ్ మార్కెట్లోకి వచ్చేస్తుందన్న అంచనాతో అమెరికా ఒప్పందం చేసుకుంది. అయితే పై కంపెనీల టీకాలన్నీ దాదాపు ఒకే సమయంలో మార్కెట్లోకి వచ్చాయి. దాంతో అమెరికాలో జనాలు కోవీషీల్డ్ ను వాడటంలేదు. ఈ కారణంగానే కోవీషీల్డ్ 6 కోట్ల డోసులు అమెరికాలో మురిగిపోతున్నాయి.

అలాగే పై కంపెనీల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకాలపై అనేక ఆరోపణలున్నాయి. కాబట్టి 2 కోట్ల డోసులు మిగిలిపోయాయి. అందుకనే తాము వాడకుండా మిగిలిపోయిన 8 కోట్ల డోసులను అమెరికా ప్రపంచదేశాలకు పంపిణీ చేసేస్తోందని ఢిల్లీ యూనివర్సిటి ప్రొపెసర్, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు కుమార్ సంజయ్ సింగ్ తెలిపారు. మొత్తానికి తమకు అవసరం లేనివాటిని వితరణ పేరుతో వదిలించేసుకోవటంలో అమెరికా తెలివి అమోఘం.