లాక్ డౌన్ సెప్టెంబర్ వరకునా? మీకో దండం సామి!

భారత్‌లో ఏప్రిల్ 14 దాకా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే 72 మంది ప్రాణాలు కోల్పోగా 2300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో లాక్ డౌన్ దాదాపు ఏప్రిల్ 14న ముగుస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు లాక్ డౌన్ ఆంక్షలు సెప్టెంబర్ మాసం దాకా పొడగించే అవకాశం ఉందని జనాలను భయపెడుతున్నాయి.

అమెరికాకు చెందిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం భారత్‌లో విధించిన లాక్ డౌన్ జూన్ నాలుగో వారంలో గానీ లేదా సెప్టెంబర్ రెండో వారంలో గానీ ఎత్తివేయొచ్చని అంచనా వేసింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో జరిగిన ప్రాణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని భారత్ ఈ లాక్ డౌన్ ఆంక్షలను అప్పటిదాకా పొడగిస్తుందని అభిప్రాయపడింది ఈ సంస్థ. అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఈ రిపోర్ట్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదని అంటున్నారు భారతీయ ఎపిడమాలజిస్టులు.

కరోనా కేసులు పెరుగుతున్నా, మిగిలినదేశాలతో పోలిస్తే మన దగ్గర ఆ రేటు చాలా తక్కువ. దాంతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయకపోయినా కూడా, మరీ సెప్టెంబర్ వరకు పొగిడించాల్సిన అవసరం అయితే రాదంటున్నారు. కాకపోతే ఒకేసారి ఆంక్షలు పూర్తిగా తొలగిస్తే జనాలు గుంపులుగా రోడ్లమీదకి చేరతారు. కాబట్టి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా ఆలోచన చేస్తారేమో. అసలు లాక్ డౌన్ గురించి ఇలాంటి వార్తలను చూసి భయపడవద్దని హామీ ఇస్తున్నారు అధికారులు.