షర్మిల కొత్త పార్టీ అధ్యక్షుడు ఎవరంటే..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె తన పార్టీ పేరు కూడా కన్ఫార్మ్ చేశారు. త‌మ‌ పార్టీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) అనే పేరును ఆమె ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. ఆమోదం కూడా ల‌భించిన‌ట్టు తెలిసింది.

కాగా.. ఈ పార్టీకి ఆమె అనుచరుడు రాజగోపాల్ అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తాను అధ్యక్షుడిగా.. వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కొత్త పార్టీల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. వైటీపీకి సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా, నూకల సురేష్‌ కోశాధికారిగా వ్యవహరిస్తామంటూ ఆ దరఖాస్తులో పేర్కొన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా తమకు తెలియజేయాలని సూచించింది.

కాగా.. వాడుక రాజగోపాల్‌ ప్రస్తుతం షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్‌ సోదరి, షర్మిల చిన్ననాటి స్నేహితులని లోట్‌సపాండ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈసీ నుంచి అధికారికంగా లేఖ వచ్చిన తర్వాత షర్మిలను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం లాంఛనమేనని ఆ వర్గాలు తెలిపాయి. జూలై 8న వైఎస్ఆర్‌ జయంతిని పురస్కరించుకుని పార్టీ పేరును షర్మిల అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.