టీకా మిక్సింగ్ ఎన్ని దేశాల్లో ఉందో తెలుసా ?

టీకా మిక్సింగ్..ఇపుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. కరోనా వైరస్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తిచేయటమే మార్గమని ప్రపంచదేశాలన్నీ అంగీకరిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఏ కంపెనీ టీకానైనా ప్రతి ఒక్కళ్ళు రెండు డోసులు వేసుకుంటునే ఉపయోగాలుంటాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.

అయితే ఇదే సమయంలో టీకాల మిక్సింగ్ గురించి కూడా చాలా దేశాలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. టీకా మిక్సింగ్ అంటే మొదటి డోసు ఒక కంపెనీది వేసుకుంటే రెండో డోసు మరో కంపెనీది అన్నమాట. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మొదటి డోసు మనదేశంలో కోవాగ్జిన్ వేసుకుంటే రెండో డోసు కోవీషీల్డ్ వేసుకోవటం అన్నమాట. మనదేశంలో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నా ఇంకా జనాలకు అందుబాటులోకి తేలేదు.

అయితే ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పద్దతిని ఆచరణలోకి తీసుకొచ్చేశాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడెన్, నార్వే, డెన్నార్క్ లాంటి దేశాలు తమ జనాలకు టీకాలు మిక్సింగ్ తీసుకోమని సూచిస్తున్నాయి. పై దేశాల్లో జనాలు మొదటి డోసును ఫైజర్ కంపెనీది తీసుకుంటే రెండు వారాలు లేదా నెలరోజుల తర్వాత ఆస్త్రాజెనికా టీకాలను వేస్తున్నారు. కాకపోతే టీకాల మిక్సింగ్ తర్వాత కొందరిలో కొద్దిపాటి జ్వరం, వొళ్ళునొప్పులు, తలతిరగడం, కీళ్ళనొప్పుల లక్షణాలు కనిపించినట్లు ప్రయోగాల్లో తేలింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీకా మిక్సింగ్ వల్ల ఉపయోగాలా ? లేకపోతే నష్టాలా ? అనే విషయంలో చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలేమో కొద్దిపాటి సమస్యలు తప్ప చెప్పుకోదగ్గ నష్టాలేమీ కనబడలేదని తేల్చేశాయి. అందుకనే తమ జనాలకు టీకా మిక్సింగ్ కు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాయి. టీకా మిక్సింగ్ వల్ల జనాల్లో రోగనిరోధకశక్తి పెరిగినట్లు కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. మరి మన దేశంలో టీకా మిక్సింగ్ మనకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.