షూటింగ్ కి రెడీ అవుతోన్న టాలీవుడ్ స్టార్స్!

లాక్ డౌన్ విధించడంతో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో పదిరోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించడంతో కేసులు మరింత తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో జూన్ రెండు లేదా మూడో వారాల్లో షూటింగ్ మొదలుపెట్టుకోవచ్చని చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్లు వస్తాయని భావిస్తున్నారు. మన స్టార్ హీరోలు కూడా ఎప్పుడు షూటింగ్ మొదలైతే అప్పుడు సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్నారట.

ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాకి సంబంధించి వేసిన సెట్ రెడీగా ఉంది. పది రోజుల పాటు అక్కడ షూటింగ్ నిర్వహిస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. అలానే ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల యూనిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ‘ఆదిపురుష్’ టీమ్ రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలానే మరో భారీ బడ్జెట్ సినిమా ‘ఆచార్య’ షూటింగ్ పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దర్శకుడు కొరటాల చెప్పారు.

ఒక్కసారి షూటింగ్ పర్మిషన్లు రాగానే టీమ్ మొత్తం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటారని కొరటాల తెలిపారు. ఇక బాలయ్య.. ‘అఖండ’ సినిమా షూటింగ్ మొదలుపెడితే.. సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్నానని బోయపాటితో చెప్పారట. వీటితో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్, ‘హరిహర వీరమల్లు’ సినిమాలను ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఇంకా మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడా కేసులు తగ్గితే షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.