కేసీఆర్ కి షాక్.. ఈటల వెంట మరో నేత..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పై భూ కబ్జా ఆరోపణలు చేయడంతో.. టీఆర్ఎస్ నుంచి తప్పుకొని.. బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు.

ఒకవైపు ఆ ప్రయత్నాల్లో ఉంటూనే… మరోవైపు టీఆర్ఎస్ లోని కీలక నేతలను కూడా పార్టీకి దూరం చేసేపనిలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ లోని అసంతృప్తులంతా.. ఈటల వైపు మొగ్గుచూపుతున్నారని అందరూ అనుకుంటూ ఉన్నారు.

తాజాగా.. ఈ మహిళా నేత.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, సీనియర్ నాయకురాలు తుల ఉమ కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆమె.. ఈటలతో సమావేశం కూడా అయ్యారు.

అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ విన్న తర్వాత.. ఆమె పార్టీ మారటం ఖాయమని అర్థమైపోయింది. కేసీఆర్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా ఆమె విమర్శలు చేయడం గమనార్హం.

స్వ‌రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలని పరిష్కరించినమా?, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపినమా? ఆదర్శవంతం అయిన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మించుకున్నామా? తెలంగాణ వనరులను సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా, మరి ఒక వర్గం కొల్లగూడుతుందా? వీటిని సమీక్షించుకోవాలి అంటూ ఉమ వ్యాఖ్యానించారు. పైగా తెలంగాణ కోసం కృషి చేసిన సుస్మా స్వ‌రాజ్, సోనియా గాంధీ, మీరా కుమార్ పేర్ల‌ను ప్ర‌స్తావించారు త‌ప్పా కేసీఆర్ పేరును మాత్రం తీసుకోలేదు. దీంతో.. ఆమె టీఆర్ఎస్ కి దూరమయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి తుల ఉమ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. ఆమెకు దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకొని ఆమె ఈటల సహాయంతో బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.