ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎవరికీ పెద్దగా పరిచయం లేని నెల్లూరులోని ఒక కుగ్రామం కృష్ణపట్నం ఇపుడు దేశమంతటా తెలిసిపోయింది. ఆ గ్రామానికి చెందిన ఆనందయ్య ప్రకృతి మూలికలతో చేసిన మందు వాడితే కరోనా ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతుందని ప్రచారం జరగడంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన విపరీతంగా పాపులర్ అయ్యారు. అది పల్లెటూరిలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితికి దారితీసింది. ఆయనేమీ అనుమతి పొందిన ఆయుర్వేద వైద్యుడు కాకపోవడంతో తర్వాత ఏదైన దుష్పరిణామాలు సంభవిస్తే …. అన్న అనుమానంతో ఎందుకైన మంచిది అని ప్రభుత్వం ఆ పంపిణీని ఆపేసి ఆ మందును పరీక్షలకు పంపింది. కేంద్రాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది. చివరకు కంట్లో వేసే మందు తప్ప మిగతా వాటికి అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా మందు తయారీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా దానిని పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రముఖ నేత, జగన్ బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఈ వ్యవహారంతో ఏమీ సంబంధం లేకపోయినా ఎందుకో దీనిపై స్పందించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ వైవీ ఏమన్నారంటే… ‘‘కేంద్ర ఆయుష్ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేదం మందు కాదు అని చెప్పింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుతో కోవిడ్ తగ్గుతుందని ఎక్కడా చెప్పలేదు. ఆ మందు వాడొద్దు అని కూడా చెప్పలేదు. ఆనందయ్య మందు తీసుకోవాలా, వద్దా అనే నిర్ణయాన్ని ప్రజల ఇష్టానికి వదిలేశారు‘‘ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

టీటీడీ ఆయుర్వేద కాలేజ్ మాత్రం ఆ మందును వాడటం లేదని, పంచడం లేదని అన్నారు. తొలుత ఆ మందును పంపిణీ చేద్దాం అనుకున్నాం గాని ఇపుడు విరమించుకున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మందుకు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇమ్యూనిటి బూస్టర్‌గా పనిచేస్తున్న ఆనందయ్య మందును ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడవచ్చని పిలుపునిచ్చారు.