మహేష్‌ను ఢీకొట్టేది అతనా?

ఒక పెద్ద స్టార్ హీరో సినిమా మొదలైందంటే.. ముందు అందులో హీరోయిన్ ఎవరని చూస్తారు. ఆ తర్వాత అందరి దృష్టీ విలన్ పాత్ర మీదికి వెళ్తుంది. మాస్ సినిమాల్లో హీరోల పాత్రలు ఎలివేట్ కావాలంటే వాళ్లకు దీటుగా అవతల విలన్ ఉండాలి. అందుకే విలన్ల కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. ఎప్పుడూ చూసే వాళ్లనే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విలన్లను తేవడానికి ప్రయత్నిస్తుంటారు.

మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’లోనూ విలన్ పాత్ర కోసం ఒక ప్రత్యేకమైన నటుడినే ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో మహేష్‌ను ఢీకొట్టబోయేది తెలుగు సినిమాలతోనూ మంచి అనుబంధం ఉన్న తమిళ నటుడు అర్జున్ అంటున్నారు. మెయిన్ విలన్ పాత్రకు ఆయన్ని ఖరారు చేశారట. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్‌లో విలన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలేమీ తీయలేదు. ఆ పాత్రకు ఎవరినీ ఖరారు చేయకుండానే షూటింగ్ మొదలుపెట్టారు.

ఐతే లాక్ డౌన్ టైంలో దొరికిన బ్రేక్‌లో దర్శకుడు పరశురామ్.. అర్జున్‌ను సంప్రదించి కథ, పాత్ర గురించి చెప్పడం ఆయన ఓకే చెప్పడం జరిగాయట. తర్వాతి షెడ్యూల్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశముంది.

హీరోగా సినిమాలు ఆపేశాక.. అర్జున్ అప్పుడప్పుడూ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట విశాల్ హీరోగా తెరకెక్కిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు)లో విలన్ పాత్రలో అర్జున్ అదరగొట్టాడు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని నెగెటివ్ రోల్స్ వస్తున్నాయి. రవితేజ సినిమా ‘ఖిలాడి’లో సైతం అర్జునే విలన్ కావడం విశేషం. ఇప్పుడు ఇంకా పెద్ద సినిమాలో నెగెటివ్ రోల్ చేసే అవకాశం దక్కింది. హీరో-విలన్‌గా మహేష్-అర్జున్ కాంబినేషన్ సినిమాకు హైలైట్ అవుతుందనే ఆశించవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఇప్పటిదాకా 20 శాతం చిత్రీకరణే జరుపుకుంది. ఈ నెలలో చిత్ర బృందంలోని వాళ్లందరికీ టీకాలు వేయించి.. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టాలని టీం భావిస్తోంది.