దేవరకొండ ప్రొడక్షన్ లో మూడో సినిమా!

టాలీవుడ్ కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. యూత్ లో విజయ్ సినిమాలకు క్రేజ్ మాములుగా ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో విజయ్ కి సరైన సినిమా పడలేదు. దీంతో తన తదుపరి సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ‘లైగర్’ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా తరువాత సుకుమార్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు ఈ సెన్సేషనల్ హీరో. నటుడిగా ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా తన బాధత్యలు నెరవేరుస్తున్నారు. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్ మొదలుపెట్టి తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మించారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కానప్పటికీ పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేశాయని అప్పట్లో విజయ్ తండ్రి గోవర్ధన్ వెల్లడించారు.

ఇదే బ్యానర్ లో రెండో సినిమా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా పెట్టి తీస్తున్నారు విజయ్ దేవరకొండ. ‘పుష్పక విమానం’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దామోదర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు విజయ్ నిర్మాతగా మూడో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. పృథ్వీ సేనా రెడ్డి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ విజయ్ కి నచ్చడంతో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో అందరూ కొత్తవాళ్లే కనిపిస్తారట. లాక్ డౌన్ పూర్తయిన తరువాత ఈ సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.