ఎన్టీఆర్ మీద వైవీఎస్ డాక్యుమెంటరీ

సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరికి సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట ఎన్టీఆర్ రెఫరెన్స్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు చౌదరి. అలాగే తన సినిమాల టైటిల్స్‌కు ముందు కూడా ఎన్టీఆర్ ఫొటో పెట్టి ఆయనకు నివాళి అర్పిస్తాడు. ఏటా ఎన్టీఆర్ జయంతికి క్రమం తప్పకుండా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడం చౌదరి క్రమం తప్పకుండా చేసే పనులు.

ఇక మీడియా వాళ్లు ఎన్టీఆర్ గురించి అడిగితే తీవ్ర ఉద్వేగంతో మాట్లాడేస్తుంటాడు చౌదరి. ఈ అభిమానంతోనే ఎన్టీఆర్ మీద ఒక బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాడు ఈ వీరాభిమాని. 2022లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇప్పట్నుంచే అందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ వెల్లడించాడు. ఎన్టీఆర్‌పై తాను తీయనున్న డాక్యుమెంటరీ గురించి కూడా ఇందులో చౌదరి వివరించాడు.

‘‘ఎన్టీఆర్ బంధు మిత్రులు, సన్నిహితులు, ఆయనతో కలిసి పని చేసిన వారు అనేకమంది ఉన్నారు. వీళ్లందరికీ ఎన్టీఆర్ మీద ఎనలేని అభిమానం ఉంది. ఆయనతో వారికి ఉణ్న అనుబంధం గురించి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాం. కొందరు యాంకర్లు ఇంటర్వ్యూలు చేస్తారు. అలాగే నేనే స్వయంగా కొందరిని ఇంటర్వ్యూ చేస్తా. రెండేళ్ల పాటు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. సమయానుకూలంగా వాటిని ప్రజల ముందుకు తెస్తాం. 2023 మే 28 వరకు ఇవి కొనసాగుతాయి. వాటితో పాటు ఎన్టీఆర్ మీద మరికొన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తాం’’ అని వైవీఎస్ తెలిపాడు.

ఎన్టీఆర్ పేరు కలిసొచ్చేలా ‘న్యూ టాలెంట్ రోర్స్’ పేరుతో తన మిత్రులు చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారని.. ఎన్టీఆర్ డాక్యుమెంటరీ ప్రాజెక్టు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే రూపొందుతుందని.. తర్వాత తన దర్శకత్వంలో అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కనున్న ప్రేమకథా చిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మిస్తుందని చౌదరి వెల్లడించాడు.