హీరోయిన్లు మీ నుండి దూరంగా పారిపోతున్నారు..

చెన్నైలో పీఎస్బీబీ అనే స్కూల్ లో పని చేస్తోన్న ఓ టీచర్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటకు రావడంతో తమిళనాట విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ సదరు టీచర్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. స్కూల్ మూతపడేలా చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కోరారు.

కాసేపటికే ఈ పోస్ట్ వైరల్ కాగా నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. విశాల్ తీరుపై మండిపడ్డారు. ముందు సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక వేధింపులను ఖండించమని సలహా ఇచ్చారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఏం జరుగుతుందో చూడమన్నారు. ఫిమేల్ లీడ్ యాక్టర్స్ ఎన్నో వేధింపులను ఎదుర్కొంటున్నారని.. మీ కారణంగా ఎందరో ఎఫెక్ట్ అవుతున్నారని విశాల్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు.

అంతేకాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయిలకు మీ సహాయం అవసరమైనప్పుడు మీరు మీ హీరోయిజాన్ని చూపించాల్సింది అంటూ విమర్శించారు. హీరోయిన్లందరూ మీ నుండి దూరంగా పారిపోతున్నారని.. దానికి మీ ప్రవర్తనే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు విశాల్ ఈ విషయంపై స్పందించలేదు. నెటిజన్లు మాత్రం విశాల్ కు మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు. ఇక గాయత్రి 2003 లో తెలుగులో ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు.