ముగ్గురు హీరోలు నో చెప్పాక.. కళ్యాణ్ రామ్ తో!

చాలా ఏళ్లుగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని చూస్తున్నారు మల్లిడి వేణు. గతంలో హీరో నితిన్, రామ్ లాంటి వాళ్లకు కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. 2016లో అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ కూడా చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. దానికి బడ్జెట్ సమస్యలే కారణమని సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలనుకున్నారు.

ఏడెనిమిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు ముందుగా అల్లు శిరీష్ మార్కెట్ పరిధుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమా కోసం ఓ భారీ దర్బార్ సెట్ కూడా వేయాలనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు. అప్పటినుండి మల్లిడి వేణు హీరోల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. వశిష్ట్ గా పేరు మార్చుకొని సినిమా అనౌన్స్ చేశారు మల్లిడి వేణు. అదే ‘బింబిసార’.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి చిన్న టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విజువల్స్ చూసిన ఇండస్ట్రీకి చెందిన కొందరు.. ఇది అల్లు శిరీష్ కోసం అనుకున్న కథే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అప్పటి కథనే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో తీస్తున్నారా..? లేక మరో హిస్టారికల్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నారా..? అనే విషయంపై దర్శకుడు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!