అక్షయ్ సినిమాలో తెలుగు నటుడు


టాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. చాలా కష్టపడి ఎదిగి ఒక స్థాయిని అందుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’; ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని హీరో ఫ్రెండు పాత్రలతో మొదలైంది అతడి నట ప్రస్థానం. ఐతే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతడి జీవితాన్ని మార్చేశాడు. ఇంకా చిన్న చిన్న పాత్రలే చేస్తున్న సమయంలో సత్యతో ‘జ్యోతిలక్ష్మి’లో ఛార్మి సరసన నటింపజేశాడు. ఈ సినిమా సరిగా ఆడకపోయినా సరే.. సత్యదేవ్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుని ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు.

గత ఏడాది ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’తో ఆకట్టుకున్న సత్యదేవ్… ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, తిమ్మరసు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని అతను ఆశిస్తున్నాడు.

కాగా సత్యదేవ్ ఇప్పుడు ఓ భారీ బాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘రామ్ సేతు’లో సత్యదేవ్‌కు ఒక కీలక పాత్ర దక్కిందట. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా కథానాయికలుగా నటిస్తుండగా.. కొన్ని ముఖ్య పాత్రల కోసం దక్షిణాది నటులనూ తీసుకుంటున్నారట. ఇప్పటికే నాజర్‌ను ఎంచుకున్న చిత్ర బృందం.. సత్యదేవ్‌కు కూడా ఒక పాత్రను ఆఫర్ చేసిందని, అందుకతను సంతోషంగా అంగీకరించాడని సమాచారం.

సత్యదేవ్ హిందీలో నటించడం కొత్తేమీ కాదు. రానా దగ్గుబాటి నటించిన ‘ఘాజి’తో పాటు ఆమిర్ ఖాన్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లోనూ ఒక పాత్రలో మెరిశాడు. ఇప్పుడు అక్షయ్ సినిమాలో కీలక పాత్రే దక్కినట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి.. లాక్ డౌన్ కారణంగా బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక చిత్రీకరణను పున:ప్రారంభించనున్నారు.