సామాజిక వ‌ర్గ‌మే అడ్డంకి: వీరి ప‌రిస్థితి ఇంతేనా ?

రాజ‌కీయాల్లో కులాల‌కు, రిజ‌ర్వేష‌న్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! సామాజిక వ‌ర్గాల ఆధారంగా ఓటు బ్యాంకును నిర్మించుకున్న నాయ‌కులు, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న‌.. రాజ‌కీయాల్లో రాణించిన నేత‌లు అనేక మంది ఉన్నారు. అయితే.. ఒక‌ప్పుడు.. ఈ సామాజిక వ‌ర్గాలు.. రిజ‌ర్వేష‌న్లు.. చ‌క్రాలు తిప్పితే.. ఇప్పు డు మాత్రం ప‌రిస్థితి కొంద‌రి విష‌యంలో యూట‌ర్న్ తీసుకుంది. అధికార పార్టీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం ప్రాణ‌ సంక‌టంగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సామాజిక వ‌ర్గానికి చెందిన రెడ్డి నేతలు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో శ్ర‌మించారు.

అయితే.. వీరిలో చాలా మందికి ప‌ద‌వులు ల‌భించ‌లేదు. ఎవ‌రిమాటో ఎలా ఉన్నా.. గుంటూరుకు చెందిన సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే, మాచ‌ర్ల ఎమ్మెల్యే విప్‌.. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఇప్పుడు కుల‌మే పెద్ద మైన‌స్ అయ్యి కూర్చొంది. మాచ‌ర్ల‌లో తిరుగులేని వ‌రుస విజ‌యాలు.. గుంటూరు జిల్లాలో దూకుడు.. వంటి నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంది. అయితే.. ఆయ‌న‌కు సామాజిక వ‌ర్గ‌మే అడ్డంకిగా మారింది. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటినా.. ఆయ‌నకు ఇప్ప‌ట్లో మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదే జిల్లాలో రెడ్ల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? లేదా ? అన్న సందేహం ఉంది. ఒక‌వేళ జ‌గ‌న్ రెడ్ల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డికి ఇప్ప‌టికే మాట ఇచ్చి ఉన్నారు. ఇక‌, జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా పార్టీ కోసం.. కృషి చేశారు. ఈయ‌న‌కు కూడా ఇదే త‌ర‌హాలో సామాజిక వ‌ర్గం అడ్డు వ‌స్తోంది. అదేవిధంగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా.. ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు. ఇలా.. ప్ర‌తి జిల్లాలోనూ.. అర్హ‌త‌లు ఉన్నా.. పార్టీకి అత్యంత విధేయులు అయినా.. కూడా ప్ర‌స్తుత ప‌రిస్థితిలో వారికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం లేదు.

ఈ విష‌యం పార్టీ నేత‌లే ఓపెన్‌గా చెప్పేసుకుంటున్నారు. గ‌తంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌.. స‌హా ప‌లువురు.. నేత‌లు ఇదే విధ‌మైన ప్ర‌తికూల ప‌రిస్థితి ఎదుర్కొనడం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌డం ఖాయ‌మ‌ని సంకేతాలు అందుతున్నా.. వీరికి మాత్రం ఛాన్స్ చిక్కే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.