వైసీపీలో ఓడిన ఈ కీల‌క నేత‌కు ఏదైనా సెట్ చేస్తారా ?

గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అయితే అంతటి సునామీలో కూడా వైసీపీ తరుపున కొందరు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్ధులు బలంగా ఉండటం వల్ల కొన్నిచోట్ల వైసీపీకి విజయం దక్కలేదు. అలా టీడీపీ చేతిలో ఓటమి పాలైన నాయకుల్లో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఒకరు.

గుంటూరు ఎంపీగా మోదుగుల పోటీ చేసి, గల్లా జయదేవ్ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక మోదుగుల పెద్దగా పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. అలాగే వైసీపీలో ఆయనకు కీలక పదవులంటివి ఏమి రాలేదు. దీంతో మోదుగుల సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో మోదుగుల టీడీపీలో కీలకంగా పనిచేశారు. 2009లో నరసారావుపేట ఎంపీగా గెలవగా, 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి, ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి మోదుగుల పార్టీలో దూకుడుగా ఉండటం లేదు. అసలు మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. తనకు ఎలాంటి పదవి రాకపోవడంతోనే మోదుగుల సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మోదుగుల బావ అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ దక్కింది. ఆయ‌న మ‌రో బావ‌ ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మోదుగుల విషయంలో జగన్ ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని తెలుస్తోంది.

అయితే ఈమధ్య పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో మోదుగుల కాస్త యాక్టివ్‌గానే ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ మంచి విజయాలే సాధించింది. అటు గుంటూరు కార్పొరేషన్ వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక ఈ ఫలితాలని బట్టి చూస్తే గుంటూరు పార్లమెంట్‌లో మోదుగులకు మంచి ఛాన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మోదుగుల గుంటూరు నుంచే బరిలో దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఎన్నికల్లోపు మోదుగులకు ఏదైనా సెట్ చేస్తారా ? లేదా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మరోసారి మోదుగుల ఎంపీగానే ల‌క్ ప‌రీక్షించుకోవాలా ? అన్న‌ది చూడాలి.