చిరు వెర్సస్ ఎన్టీఆర్.. ఆక్సిజన్ వార్

కరోనా సెకండ్ వేవ్‌లో చాలామంది వైరస్ బాధితులకు ఆక్సిజన్ అత్యవసరమైంది. కానీ ఆసుపత్రుల్లో ఉన్న నిల్వలు బాధితులకు ఏమాత్రం సరిపోలేదు. చాలా చోట్ల సమయానికి ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోయాయి. ఎన్నో ఘోరాలు చూశాం. ప్రభుత్వాల వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో దారుణాలు జరిగాయి. ఐతే కొంచెం ఆలస్యంగా అయినా ప్రభుత్వాలు మేలుకొన్నాయి. అలాగే స్వచ్ఛందం సంస్థలు, సెలబ్రెటీలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లను సిద్ధం చేశారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేలా వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన్ని చూసి వేరే వాళ్లు కూడా కదులుతున్నారు.

ఐతే ఈ విషయంలో కూడా మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఫ్యాన్ వార్స్ తప్పట్లేదు సామాజిక మాధ్యమాల్లో. చిరు చేస్తున్న మంచి పనిని పొగడకుండా.. ఆయన ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నాడని, పెడుతున్న ఖర్చును ఎక్కువ చేసి చూపిస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ నెగెటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా తెలుగుదేశం అభిమానులు ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆక్సిజన్ ట్యాంకులే ఏర్పాాటు చేస్తున్నారని వాటి ముందు చిరు చేస్తున్నదెంత అని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఈ వ్యవహారంలో వైసీపీ వాళ్లు ఇందులో కలగజేసుకోవట్లేదు.

కాగా మెగా అభిమానులు, జనసైనికులేమో.. ఒక పెద్ద పొలిటికల్ పార్టీ అయి ఉండి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెలుగుదేశం తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదని, చిరు ఛారిటబుల్ ట్రస్టును చూసి ఎన్టీఆర్ ట్రస్ట్ కాపీ కొడుతోందని ఎద్దేవా చేస్తున్నారు. ఐతే ఎవరు మంచి పని చేసినా అందరూ అభినందించాలి. ప్రోత్సహించాలి. కానీ ఇలాంటి విషయాల్లో కూడా అవతలి వాళ్లకు ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందే అని డీగ్రేడ్ చేస్తూ, తాము గొప్ప అని డబ్బా కొట్టుకోవడం విచారకరం.