స్విగ్గీ.. జొమాటోలకు షాకిస్తున్నారు

ఫుడ్ డెలివరీ యాప్ లు.. స్విగ్గీ.. జొమాటోలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్ లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు ఇంట్లో వండుకోలేక.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చుకొని.. నచ్చిన ఆహారాన్ని నచ్చిన చోటు నుంచి తెప్పించుకునే అవకాశం ఉన్న ఈ సంస్థలకు షాకిచ్చేందుకు కొన్ని పెద్ద రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. స్విగ్గీ.. జొమాటోలు రెస్టారెంట్ల నుంచి 30 శాతం కమిషన్ ను వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు.. సర్వీసు ఛార్జీలు.. డెలివరీ ఛార్జీల పేరుతో బాదే బాదుడు గురించి తెలియంది కాదు. ఇంత చేసినా.. వినియోగదారుడికి తామేమీ ఇవ్వకుండా.. తమ లాభంలో భారీ వాటాను స్విగ్గీ.. జొమాటోలకు ఇవ్వాల్సి వస్తుందన్న ఆగ్రహాన్ని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ భావిస్తోంది.

అందుకే.. సొంతంగా తమదైన ఆన్ లైన్ ప్లాట్ ఫాంలను క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రెస్టారెంట్లు.. డాట్ పే.. థ్రైవ్ లాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని.. ఆన్ లైన్ ఆర్డర్ ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తున్నాయి. గూగుల్.. ఫేస్ బుక్ ద్వారా ఆన్ లైన్ లో తాము తెర మీదకు తెస్తున్న డెలివరీ యాప్ లపై ప్రచారాన్ని నిర్వహించటం ద్వారా.. వాటిని వినియోగదారులకు దగ్గర చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్ ముంబయి.. డిల్లీల్లో మొదలైనట్లు చెబుతున్నారు. జొమాటో.. స్విగ్గీల తీరుకు చెక్ పెట్టటానికి ఇంతకు మించిన మరో మార్గం లేదన్న మాట పలు రెస్టారెంట్ల యజమానులు భావిస్తుండటం గమనార్హం. అటు వినియోగదారులకు.. ఇటు వ్యాపారులకు లబ్ధి లేకుండా చేస్తున్న ఈ సంస్థలకు ఈ మాత్రం జరగాల్సిందే అన్న మాట వినిపిస్తోంది.