థియేట‌ర్ల‌లో మ‌ద్యం అమ్మితే..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల యాజ‌మాన్యాలు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మ‌న దేశం ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికే రెండు నెల‌లుగా మూత ప‌డి ఉన్నాయి. ఇంకో నాలుగైదు నెల‌లు తెరుచుకునే ప‌రిస్థితి లేదు. ఎప్పుడో ఒక‌ప్పుడు తెరుచుకున్నా కూడా జ‌నాలు మునుప‌టిలా థియేటర్ల‌కు వ‌స్తారా.. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు బాగా అల‌వాటు ప‌డ్డ జ‌నాలు థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌చ్చ‌ని.. క‌రోనా భ‌యం కూడా వాళ్ల‌ను వెన‌క్కి లాగొచ్చ‌ని.. దీని వ‌ల్ల థియేట‌ర్లు పునఃప్రారంభం అయిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాద‌ని, మెయింటైనెన్స్ చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల భ‌వితవ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారేలా ఉంది.

ఈ ప‌రిణామాల్ని దృష్టిలో ఉంచుకుని మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఒక ఆస‌క్తిక‌ర సూచ‌న చేసి ట్విట్ట‌ర్లో చ‌ర్చ‌కు తెర లేపాడు. తాను నిర్మాత ద‌గ్గుబాటి సురేష్‌, ఆయ‌న త‌న‌యుడైన న‌టుడు రానాతో త‌ర‌చుగా మాట్లాడుతుంటాన‌ని.. ఈ క్ర‌మంలో థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ఎక్కువ మందిని ర‌ప్పించ‌డం కోసం విదేశాల్లో మాదిరి బీర్, బ్రీజ‌ర్‌, వైన్ లాంటివి స‌ర‌ఫ‌రా చేసేందుకు లైసెన్స్ పొందితే ఎలా ఉంటుంది అనే దానిపై చ‌ర్చించిన‌ట్లు నాగ్ వెల్ల‌డించాడు.

ఇది మంచి ఐడియానా కాదా అని అత‌ను ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల‌ను ప్ర‌శ్నించాడు. ఇలా చేస్తే ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రావ‌డం మానేస్తార‌న్న వాద‌న నిజ‌మే అని.. ఐతే మ‌ల్టీప్లెక్సుల్లో ఈ ప‌ద్ధ‌తి అమ‌లు చేయొచ్చేమో అని అశ్విన్ అన్నాడు. ఇది కాకుండా లాక్ డౌన్ త‌ర్వాత‌ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులను ర‌ప్పించ‌డానికి ఏం చేయాలో చెప్పాలంటూ ట్విట్ట‌ర్ జ‌నాల్ని అడిగాడత‌ను.

ఐతే మోడ‌ర్న్ కంట్రీస్‌లో ఇది చెల్లుతుందేమో కానీ.. ఇండియా లాంటి దేశాల్లో అశ్విన్ ప్ర‌తిపాద‌న అమ‌లు చేయ‌డం క‌ష్ట‌మే. మామూలుగానే భ‌విష్యత్తులో మ‌ల్టీప్లెక్సుల్లో సెలెక్టివ్‌గా ఇలాంటి ఏర్పాట్లు చేయొచ్చేమో కానీ.. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించ‌డం కోసం అయితే ఇది వ‌ర్క‌వుట‌య్యే ప్ర‌తిపాద‌న కాదు.