క‌ళ్యాణ్ రామ్ సైలెంట్ స్ట్రోక్


ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్లు సాగుతోంది నంద‌మూరి క‌ళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి అత‌నొక్క‌డే, ప‌టాస్, 118.. ఇవి మాత్ర‌మే క‌ళ్యాణ్ రామ్ కెరీర్లో పెద్ద హిట్లు. ఈ సినిమాల‌కు ముందు, త‌ర్వాత అత‌డిది ప‌రాజ‌య ప‌రంప‌రే. ఒక హిట్టు కొట్టాడ‌ని సంతోషించే లోపు రెండు మూడు డిజాస్ట‌ర్లు డెలివ‌ర్ చేస్తాడు. రెండేళ్ల కింద‌ట‌ 118తో స‌క్సెస్ సాధించాక గ‌త ఏడాది ఎంత మంచివాడ‌వురాతో గ‌ట్టి ఎదురు దెబ్బ తిన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కొత్త సినిమా మొద‌లుపెట్ట‌డానికి చాలా టైం తీసుకున్నాడ‌త‌ను.

ఈ మ‌ధ్య మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడితో కొన్ని నెల‌ల కింద‌ట ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న సినిమా ఇదొక్క‌టే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఉన్న‌ట్లుండి క‌ళ్యాణ్ రామ్ నుంచి కొత్త చిత్రం ప్ర‌క‌ట‌న వ‌చ్చిందిప్పుడు.

ఐతే ఈ సినిమా త్వ‌ర‌లో మొద‌లు కాబోయేది కాదు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్ర‌మిది. క‌ళ్యాణ్ రామ్ సొంత సంస్థ నంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్ బేన‌ర్లో ఇది తెర‌కెక్కింది. వ‌శిష్ఠ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించాడు. దీని ప్రి లుక్ తాజాగా రిలీజ్ చేశారు. సింహం బొమ్మ ఉన్న జెండా.. పుస్త‌కంలోకి గుచ్చుకున్న ఒక క‌త్తి.. రెండు వైపులా యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న సైనికులు.. ఇలా ఈ ప్రి లుక్ పోస్ట‌ర్లో చాలా విశేషాలే క‌నిపిస్తున్నాయి. ఇదొక భారీ చిత్రం అనే భావ‌న క‌లుగుతోంది.

శుక్ర‌వారం ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ సినిమా గురించి క‌ళ్యాణ్ రామ్ మిత్రుడు, పీఆర్వో ట‌ర్న్డ్ ప్రొడ్యూస‌ర్ మ‌హేష్ కోనేరు ఒక ఆస‌క్తిక‌ర ట్వీట్ వేశాడు. క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని, గ‌త ఏడాదే చిత్రీక‌ర‌ణ మొద‌లైన‌ప్ప‌టికీ సైలెంటుగా చిత్ర బృందం ప‌ని చేసుకుపోయింద‌ని.. ఇప్పుడు ఈ సినిమా విశేషాలు పంచుకోబోతున్నామ‌ని వెల్ల‌డించాడు.