నేత‌ల మ‌ధ్య రాజ‌కీయం.. చంద్ర‌బాబుకు శాపంగా మారిందా..?


నేత‌ల మ‌ధ్య రాజ‌కీయం.. పార్టీకి, పార్టీ అధినేత‌కు శాపంగా మారింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అది కూడా రాజ‌కీయంగా కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో కావ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ టీడీపీ నేత‌లు.. ఒక‌రిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌డం వంటివి పార్టీనే కాకుండా.. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ఇబ్బందిక‌రంగా మారాయి. నిజానికి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. నేత‌ల మ‌ధ్య స‌ర్దు బాటు చేసుకునే ప‌రిస్థితి ఉంటుంది.

విజ‌య‌వాడ ప‌రిస్థితిని తీసుకుంటే.. ఇక్క‌డి నేత‌లు కూడా అంద‌రూ సీనియ‌ర్లే. అయిన‌ప్ప‌టికీ.. ఏ ఒక్క‌రూ కూడా స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మయంలో త‌లెత్తిన ఆధిప‌త్య పోరు.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింద‌నే చెప్పాలి. అయితే.. ఈ వివాదాన్ని స‌ర్దు బాటు చేసే ఉద్దేశంతో చంద్ర‌బాబు జోక్యం చేసుకుని.. తానే స్వ‌యంగా ప్ర‌చారంలోకి దిగారు. అయితే.. ఇది స్వ‌యంగా ఏ నేత‌కు కూడా స్వాంతన క‌లిగించ‌లేదు.

అంటే.. చంద్ర‌బాబు.. నేరుగా చెప్ప‌క‌పోయినా.. ఎంపీ కేశినేని నానిని స‌మ‌ర్ధిస్తున్నార‌ని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌,మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వంటివారు భావించే ప‌రిస్థితి తెచ్చింది. పోనీ.. నానీ అయినా.. యాక్టివ్ అయ్యారా? అంటే.. అది కూడా లేదు. త‌న ఇగో శాటిస్ ఫై కాలేద‌ని ఆయ‌న ఫీల‌వుతున్నారు. అంటే.. చంద్ర‌బాబు త‌న‌ను హైలెట్ చేయ‌డం లేద‌ని.. ఎంపీ నాని ముభావంతో ఉన్నారు. అటు బుద్ధా, బొండా మాత్రం చంద్ర‌బాబు సొంత కులానికి చెందిన ఎంపీకే స‌పోర్ట్ చేస్తున్నార‌ని వాపోతున్నారు.

ఇక గ‌ద్దె లాంటి వాళ్ల‌తోనూ బుద్ధా, బొండాకు పొస‌గ‌ని ప‌రిస్థితి. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా అంటే వీళ్ల‌లో ఎవ‌రికి ప‌డ‌దు. ఇలా ఎవ‌రికి వారు.. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఆధిప‌త్యం కోసం చేసుకుంటున్న పోరాటం.. వ్య‌క్తిగ‌తాలు దాటి చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకున్న‌ట్టుగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు.. నాయ‌కులు ఒక‌రితో ఒక‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ముందుకు సాగాలి. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వివాదంలో చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు ఎప్పుడు త‌ప్పుతాయో అంటున్నారు.