ఆ హీరోయిన్ అందం తిరిగొచ్చింది

రైజా విల్సన్.. నెల కిందట సోషల్ మీడియాలో మార్మోగిన పేరు. ఈ తమిళ నటి తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఒక డెర్మటాలజిస్టును సంప్రదించడం.. ఆమె చేసిన ఓ చర్మ చికిత్స వికటించి రైజా విల్సన్ అంద విహీనంగా తయారు కావడం తెలిసిందే. కంటి కింది భాగం వాచిపోయి.. ముఖారవిందం దెబ్బ తిన్న స్థితిలో రైజా పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. తనకు సదరు డెర్మటాలజిస్టు చేసిన చికిత్స వల్లే ఇలా జరిగిందంటూ ఆమె బోరున విలపించింది.

అవసరం లేకపోయినా ఆ వైద్యురాలు ఒత్తిడి చేసి ఈ చికిత్స చేశారని, ఫలితంగా తాను అందవిహీనంగా మారినట్టు చెప్పుకొచ్చింది. తనకు జరిగిన నష్టానికి కోటి రూపాయల నష్టపరిహారంతో చికిత్సకు తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై ఆ లేడీ డాక్టర్‌ కూడా దీటుగానే స్పందించింది. తన పేరును దెబ్బ తీసినందుకు రైజాపై రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ రాజీకి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు జనాలు. ఐతే ఈ గొడవ తర్వాత నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన రైజా.. ఎట్టకేలకు మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది.

రైజా విల్సన్‌ ముఖం ఇప్పుడు పూర్వస్థితికి చేరుకుంది. కళ్ల కింద వాపు తగ్గింది. మళ్లీ రైజా అందంగా తయారైంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే డాక్టర్‌తో గొడవ, చర్మ చికిత్స వికటించడం గురించి ఆమె ఇప్పుడేమీ మాట్లాడట్లేదు. గొడవ సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. తమిళంలో రైజా విల్సన్ ‘వేలైయిల్ల పట్టాదారి-2’, ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’, ‘వర్మ’ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్‌ఐఆర్‌’ సహా నాలుగైదు సినిమాలున్నాయి.