జర్నలిస్టు కోసం విమానాన్నే హైజాక్ చేయించిన ప్రభుత్వం

అవును వినటానికే విచిత్రంగా ఉన్నా వాస్తవంగా జరిగిందిదే. అందులోను విమానాన్ని హైజాక్ చేసింది దేనికోసమంటే ఓ జర్నలిస్టును అదుపులోకి తీసుకోవటానికి. ఇంతకీ విషయం ఏమిటంటే బెలారస్ లో ఆమధ్య జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు, అడ్డుగోలు చర్యలతో అలాగ్జాండర్ లుకాషంకో గెలిచారనే ఆరోపణలు పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆరోపణలు పెరిగిపోయాయో జనాలు గొడవలు మొదలుపెట్టేశారు. సరే అల్లర్లను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేసింది.

అయితే జనాల అల్లర్లకు కొందరు జర్నలిస్టులు, స్వచ్చంద సంస్ధలే కారణమని అధ్యక్షుడికి సమాచారం అందింది. సదరు జర్నలిస్టులను పట్టుకోమని పోలీసులకు ఆదేశాలిచ్చారు అధ్యక్షుడు. అయితే కొందరు పట్టుబడగా మరికొందరు జర్నలిస్టులు తప్పించుకుని దేశం విడిచి పారిపోయారు. ఇలా తప్పించుకుని పారిపోయిన జర్నలిస్టుల్లో రోమన్ ప్రొటాసెవిచ్ కూడా ఒకడు.

రోమన్ బెలారస్ నుండి తప్పించుకుని పోలెండ్ పారిపోయాడు. అయితే కొద్దిరోజుల తర్వాత ఏథెన్స్ నుండి లుథివేనియాకు ప్రయాణమయ్యాడు. టికెట్ బుక్ చేసుకుని రోమన్ విమానం ఎక్కగానే బెలారస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు విషయాన్ని పసిగట్టారు. అదే విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చేరవేశారు. ఎప్పుడైతే విమానం టేకాఫ్ అయి బెలారస్ మీదుగా ప్రయాణం మొదలుపెట్టింది.

దీంతో విషయం తెలుసుకున్న బెలారస్ ప్రభుత్వం వెంటనే ఓ యుద్ధవిమానాన్ని సివిల్ విమానం మీదకు పంపింది. విమానంలో బాంబు ఉందని తమకు సమాచారం అందింది కాబట్టి వెంటనే విమానాన్ని బెలారస్ విమానాశ్రయంలో దించాలంటు పైలెట్ ను ఒత్తిడిపెట్టారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని పైలెట్ చివరకు విమానాన్ని బెలారస్ లో దింపేశాడు. వెంటనే పోలీసులు విమానాన్ని చుట్టుముట్టి ప్రయాణీకులందరినీ తనిఖీ చేసి జర్నలిస్టుతో పాటు మరో ముగ్గురిని పట్టుకున్నారు.

తర్వాత విమానంలో కాసేపు సోదాలు చేసినట్లు చేసి బాంబు లేదని చెప్పి విమానాన్ని పంపేశారు. అంటే ఓ జర్నలిస్టును అరెస్టు చేయటానికి స్వయంగా బెలారస్ అధ్యక్షుడే ఓ పౌర విమానాన్ని హైజాక్ చేశారన్నమాట. విషయం తెలియగానే ప్రపంచదేశాలు బెలారస్ అధ్యక్షుడి చర్యలపై మండిపోతున్నాయి. అయితే ఎవరెంత గోలచేసినా బెలారస్ మాత్రం లెక్క చేయటంలేదు. చివరకు ఆ జర్నలిస్టు కథ ఏమవుతుందో ఏమో ?