పోలీసులనే మోసం చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని

తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. చేసిన తప్పు నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. తాజాగా ఆ విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఒక పెద్ద కంపెనీలో టీం లీడర్ గా పని చేసే మహిళ విలాసాల మోజులో ఎంత దారుణానికి దిగిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పోలీస్ కానిస్టేబుల్ ను జైలుకు పంపిన ఆమె.. తాజాగా చేసిన పాపం పండి తనూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది.

షాకింగ్ గా ఉండే ఈ ఉదంతంలోకి వెళితే.. హైదరాబాద్ లోని నాగోలుకు సమీపంలోని బండ్లగూడకు చెందిన 33 ఏళ్ల బ్లెస్సీ అలియాస్ అల్లూరు నేహా ఒక కంపెనీలో టీం లీడరుగా పని చేసేవారు.


ఖరీదైన జీవితం ఆమెకు అలవాటైంది. విలాసాల మోజులో కూరుకుపోయింది. కరోనా కారణంగా ఆమె జాబ్ పోయింది. ఒక జిమ్ లో ఏఆర్ కానిస్టేబుల్ తో పరిచయమైంది. కట్ చేస్తే.. అతడికి పెళ్లైందన్న విషయాన్ని దాచి పెట్టి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ తో అతన్ని జైలుకు పంపారు.

ఇదిలా ఉంటే.. సదరు కానిస్టేబుల్ భార్యతో పాటు.. ఇతర కుటుంబ సభ్యులకు చెందిన నకిలీ ప్రొఫైల్స్ తో ఇన్ స్ట్రా.. ఫేస్ బుక్ ఖాతాల్ని క్రియేట్ చేసింది. అభ్యంతరకర సందేశాలు.. అసభ్య మెసేజ్ లు పంపటం షురూ చేసింది. ఈ టార్చర్ భరించలేని కానిస్టేబుల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి కారణం.. బ్లెస్సీగా తేల్చారు. తాజాగా ఆమెను అరెస్టు చేశారు.