కృష్ణపట్నం మందు వాడిన హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితి ఇలానా?

రెండు రోజుల క్రితం ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందులో నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన రిటైర్డు హెడ్మాస్టర్ కోటయ్య కరోనా తీవ్రతతో ఇబ్బంది పడ్డారు. ఆయన ఆనందయ్య ఇచ్చిన మందును కళ్లల్లో వేసిన రెండు.. మూడు నిమిషాలకే లేచి కూర్చున్నానని.. తన ఆరోగ్యం బాగైందని చెప్పటం తెలిసిందే. ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో కోటయ్య మాష్టారి మాటల వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఆనందయ్య మందు ప్రభావం ఎంతలా ఉంటుందనటానికి కోటయ్య మాష్టారి మాటలు నిదర్శనంగా మారాయి.

అయితే.. కోటయ్య మాష్టారి మాటల్ని కొందరు వైద్యులు ఖండించారు. ఆయన పరిస్థితి ఇప్పటికైతే బాగుండొచ్చు కానీ.. రెండు రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి కావొచ్చంటూ వాదనలు వినిపించాయి. అనుకున్నట్లే రెండు రోజులు గడిచిన వేళ.. కోటయ్య మాష్టారి ఆరోగ్యం ఎలా ఉందన్న కొన్ని మీడియా సంస్థల చొరవ కొత్త విషయాల్ని వెలుగు చూసేలా చేసింది. దీనికి వైద్యులు కూడా కారణమన్న అభిప్రాయం కూడా ఉంది.

వైరల్ వీడియోలో హుషారుగా మాట్లాడిన కోటయ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆయన కళ్లు కూడా తెరవ లేకపోతున్నారు. చూడలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఆనందయ్య మందు వేసుకోవటానికి వెళ్లిన సమయంలో ఆయన ఆక్సిజన్ లెవెల్స్ బాగుండేవని.. ఇప్పుడు బాగా క్షీణించినట్లు చెబుతున్నారు. పది రోజుల నుంచి కరోనాతో బాధ పడుతున్న కోటయ్య.. ఆనందయ్య ఇచ్చిన చుక్కల మందు తీసుకున్న తర్వాత కొంత నయమైనట్లుగా ఉన్నప్పటికి.. రెండు రోజుల్లోనే ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కోటయ్యకు వెంటిలేటర్ మీద వైద్య చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ టెస్టు నిర్వహిస్తే నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసినప్పుడు రెండు రోజుల క్రితం హుషారుగా ఉండి ఆనందయ్య మందు గురించి చెప్పిన కోటయ్య.. ఇప్పుడు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.